పైరసీ బెడద నిన్నటి వరకూ సినిమాలకే అనుకున్నాం.. ఇప్పుడు ప్రముఖల పుస్తకాలకూ వ్యాపించింది. ముఖ్యమంత్రి వైఎస్ జగన్ మాతృమూర్తి, వైఎస్ ఆర్ కాంగ్రెస్ గౌరవాధ్యక్షురాలు వైఎస్ విజయమ్మ రచించిన నాలో..నాతో ..వైఎస్ ఆర్ పుస్తకాన్ని ఇటీవల జగన్ ఇడుపుల పాయలో ఆవిష్కరించిన సంగతి తెలిసిందే. ఇందులో వైఎస్ భార్యగా ఆమె అనేక ఆసక్తికర విషయాలు వెల్లడించారు.
అయితే.. ఈ పుస్తకం పేరుతో ఓ పీడీఎఫ్ సోషల్ మీడియాలో సర్క్యులేట్ అవుతోంది. అయితే అది ఫేక్ అని గుర్తించారు. సోషల్ మీడియాలో ప్రచారంలోకి వచ్చిన పిడిఎఫ్ పైల్ పై డిజిపికి ఫిర్యాదు చేశారు. బహుళ ప్రజాదరణ పొందుతున్న ఈ పుస్తకానికి.. నెట్ లో ఉన్న పుస్తకం పైల్ కు సంబందం లేదని టిటిడి బోర్డు అద్యక్షుడు వైవి సుబ్బారెడ్డి చెప్పారు. ‘నాలో..నాతో..వైఎస్సార్’’ పుస్తకం పేరుతో పీడీఎఫ్ ఫైల్ను సామాజిక మాధ్యమాల్లో సర్క్యూలేట్ చేస్తున్నట్లుగా తమ దృష్టికి వచ్చిందని, వైఎస్ విజయమ్మ రాసిన పుస్తకానికి, దీనికి సంబంధం లేదని ఆయన చెప్పారు.
ఎమెస్కో పబ్లిషర్స్ అచ్చువేసిన పుస్తకమే అసలైన పుస్తకమని ఆయన తెలిపారు. అయితే అసలు ఓ పుస్తకాన్ని ఫేక్ చేయాల్సిన అవసరం ఎందుకు వచ్చింది.. ఎందుకు ఇలా కావాలని వైఎస్ కు సంబంధించిన కీలకమైన పుస్తకాన్ని తప్పుగా చిత్రీకరించి మరీ దాన్ని సోషల్ మీడియాలో వైరల్ చేస్తున్నారన్నది ఇప్పుడు అంతుచిక్కని ప్రశ్నగా మారింది.
ఇటీవల టీటీడీ పేరుతో పోస్టులో సువార్త పుస్తకం రావడం వెనుకా కుట్ర ఉందని సుబ్బారెడ్డి ఆరోపిస్తున్నారు. ఇలా వరుస ఘటనలు జగన్ సర్కారును ఇరుకున పెట్టేలా జరుగుతుండటం వెనుక అసలు సూత్రధారులు ఎవరన్నది ఇప్పుడు చిక్కువీడాల్సిన ప్రశ్న. చూద్దాం పోలీసులు ఏం కనిపెడతారో..?