కరోనా కోసం ఇప్పటికే అనేక మందులను సూచిస్తున్నారు. కానీ వీటిలో ఏవీ కచ్చితంగా కరోనాను నిరోధిస్తాయన్న రూఢీ లేదు. కానీ.. గుడ్డి కంటే మెల్ల మేలు కదా.... అన్నట్టు ఈ మందులను వాడుతున్నారు. ట్రయల్ ఎండ్ ఎర్రర్ పద్దతిలో అనేక మందులను కరోనా రోగులపై ప్రయోగించి ఫలితాలు చెక్ చేస్తున్నారు.
అలా సాగించిన ప్రయోగాల్లో ఇప్పుడు మరో గుడ్ న్యూస్ తెలుస్తోంది. ఇప్పటి వరకూ సొరోసిస్ వ్యాధి చికిత్సలో ఉపయోగించే ఇటోలిజుమాబ్ ఇంజెక్షన్ ను కూడా కరోనాకు బాగానే పనిచేస్తోందట. ఈ ఇంజక్షన్ ను కొవిడ్ 19 వైరస్ బాధితులకు పరిమితంగా వాడేందుకు డీసీడీఐ సంస్థ అనుమతించింది.
కరోనా వైరస్ బారిన పడి తీవ్రంగా లేదా మోస్తరుగా శ్వాసకోశ సమస్యలతో బాధపడుతున్న వారికి పరిమితంగా ఇటోలిజుమాబ్ ను వినియోగించవచ్చని డీసీడీఐ సంస్థ తెలిపింది. ఇప్పటికే ఈ ఇంజక్షన్ ను క్లినికల్ ట్రయల్స్ లో వైరస్ బాధితులపై ప్రయోగించారట. ఈ ఇటోలిజుమాబ్ సంతృప్తికర స్థాయిలో ప్రభావం చూపించిందట.
అందుకనే.. ఈ ఇటోలిజుమాబ్ ఇంజక్షన్ ను కరోనా రోగులకు పరిమితంగా వాడేందుకు వైద్య నిపుణుల కమిటీ గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది. అయితే.. సొరోసిస్ వ్యాధి బాధితుల చికిత్స కోసం ఎప్పటి నుంచో ఈ ఔషధాన్ని వినియోగిస్తున్నారు. తప్పదు.. కరోనాకు వ్యాక్సీన్ కనిపెట్టే వరకూ రోగుల ప్రాణాలు కాపాడేందుకు ఇలాంటి రిస్కులు తీసుకోక తప్పదన్నమాట.