గ‌త కొద్దిరోజులుగా హాట్ టాపిక్ తెలంగాణ ముఖ్య‌మంత్రి కె. చంద్రశేఖర్ రావు ఎక్క‌డా అని. ఆయ‌న ఫాంహౌస్‌లో ఉన్నాడ‌నే విష‌యంలో అన‌ధికారికంగా మీడియాలో ప్ర‌చారం జ‌రిగింది. అయితే, తాజాగా ముఖ్య‌మంత్రి కేసీఆర్ కీల‌క స‌మీక్షా స‌మావేశం నిర్వ‌హించారు. ప‌లు తీపిక‌బుర్లు వెల్ల‌డించారు. రైతుబంధు సాయం, ఇతర వ్యవసాయ అంశాలపై ముఖ్యమంత్రి ఇవాళ ప్రగతి భవన్ లో ఉన్నత స్థాయి సమీక్ష నిర్వహించారు. మంత్రులు  ఎస్. నిరంజన్ రెడ్డి,  వేముల ప్రశాంత్ రెడ్డి, రైతుబంధు సమితి రాష్ట్ర అధ్యక్షుడు  పల్లా రాజేశ్వర్ రెడ్డి, ప్రభుత్వ ముఖ్య సలహాదారు  రాజీవ్ శర్మ, ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి  సోమేశ్ కుమార్, ముఖ్య కార్యదర్శులు  బి. జనార్థన్ రెడ్డి,  రామకృష్ణ రావు,  నర్సింగ్ రావు, సీడ్ కార్పొరేషన్ ఎండి  కేశవులు, వ్యవసాయ శాఖ ఉప సంచాలకులు  విజయ్ కుమార్, డిడిఎ   శైలజ, సిఎంఓ కార్యదర్శి  స్మితా సభర్వాల్ తదితరులు పాల్గొన్నారు. రాష్ట్రంలో రైతుబంధు సాయం అందని రైతులు ఏ మూలన ఎవరున్నా వెంటనే గుర్తించి, చిట్ట చివరి రైతు వరకు అందరికీ ఆర్థిక సాయం అందించాలని ముఖ్యమంత్రి  కె. చంద్రశేఖర్ రావు అధికారులను ఆదేశించారు. 

 

తెలంగాణ ప్రభుత్వం సూచించిన మేరకే రైతులు వందకు వందశాతం నియంత్రిత పద్ధతిలో ఈ వానాకాలం పంట సాగు చేస్తుండడం శుభసూచకమని, ఇది భవిష్యత్తులో సాధించే గొప్ప విజయానికి నాంది అని  సీఎం అన్నారు. సీడ్ డెవలప్‌మెంట్‌  కార్పొరేషన్ ఉత్పత్తి చేసే విత్తనాలను నిల్వ చేసేందుకు రూ.25 కోట్ల వ్యయంతో అతి పెద్ద అల్ట్రా మోడర్న్ కోల్డ్ స్టోరేజి నిర్మించనున్నట్లు వెల్లడించారు. రాష్ట్ర వ్యాప్తంగా అన్ని క్లస్టర్లలో రైతువేదికల నిర్మాణం దసరా నాటికి పూర్తి చేయాలని ఆదేశించారు. ‘‘కరోనా కష్టకాలంలో ఆర్థిక పరిస్థితి అంత ఆశాజనకంగా లేకపోయినప్పటికీ ప్రభుత్వం రైతులకు అండగా నిలవాలనే సదుద్దేశ్యంతో రైతుబంధు సాయం విడుదల చేసింది. అధికారులు ఎంతో సమన్వయంతో వ్యవహరించి రైతులందరికీ సకాలంలో రైతుబంధు సాయం అందించారు. ఇప్పటి వరకు అందిన సమాచారం ప్రకారం 99.9 శాతం మంది రైతులకు రైతుబంధు సాయం అందింది. ఇంకా ఎవరైనా రైతులు మిగిలిపోయినా, వెంటనే వారిని గుర్తించి సాయం అందించాలి. ఏ ఒక్కరూ మిగలకుండా చిట్ట చివరి రైతు వరకు రైతుబంధు సాయం అందించాలి. మంత్రులు తమ జిల్లాలో, ఎమ్మెల్యేలు తమ నియోజకవర్గాల్లో రైతులందరికీ సాయం అందిందా? ఇంకా ఎవరైనా మిగిలిపోయారా? అనే విషయాలను వెంటనే తెలుసుకుని, అందరికీ డబ్బులు అందించే ఏర్పాట్లు చేయాలి. `` అని తెలంగాణ సీఎం కేసీఆర్ స్ప‌ష్టం చేశారు.

 


కొంత మంది రైతులకు యాజమాన్య హక్కుల విషయంలో చిన్న చిన్న సమస్యలు ఉండడం వల్ల రైతుబంధు సాయం అందడంలో ఇబ్బంది కలిగే అవకాశం ఉందని పేర్కొన్న సీఎం కేసీఆర్ అలాంటి వారిని జిల్లా కలెక్టర్లు గుర్తించి సమస్యలు వెంటనే పరిష్కరించాలని కోరారు. ``యాజమాన్య హక్కు గుర్తించడానికి మోకా మైనా (స్పాట్ ఎంక్వైరీ) నిర్వహించాలి. చుట్టుపక్కల రైతులను విచారించి యాజమాన్య హక్కులు కల్పించాలి. అందరి సమస్యలు పరిష్కరించి, అందరికీ సాయం అందించాలి. ఈ విషయంలో రైతుబంధు సమితుల, స్థానిక ప్రజాప్రతినిధుల సహకారం తీసుకోవాలి. ఒక సారి పరిష్కారం అయిపోతే, ఎప్పటికీ గొడవ ఉండదు. అది అన్ని విధాల‌ మంచిది’’ అని పేర్కొన్నారు.

మరింత సమాచారం తెలుసుకోండి: