ప్రపంచాన్ని కరోనా మహ్మారితో అతలాకుతలం చేస్తున్న డ్రాగన్ కంట్రీ చైనా గుట్టు మరోమారు రట్టయింది. చైనా వల్లే ప్రపంచానికి ఈ మహమ్మారి అంటుకుందనే నిజం బట్టబయలు అయింది. హాంగ్ కాంగ్ పరిశోధకురాలు లి-మెంగ్ యాన్ ఫాక్స్ న్యూస్ చానల్కు ఇచ్చిన ప్రత్యేక ఇంటర్యూలో కరోనా వైరస్కు సంబంధించిన సంచలన వాస్తవాలను బయటపెట్టారు. కరోనా వైరస్ గురించి చైనాకు ముందే తెలుసని ఆమె వెల్లడించారు. వైరస్ వ్యాప్తికి మూలమైన వూహాన్ నగరంలోని డాక్టర్లు, పరిశోధకులు ఒక్కసారిగా మాట్లాడం ఆపేశారని, వైరస్ గురించి అడగవద్దంటూ తనని హెచ్చరించారని ఆమె వివరించారు. తాము మాస్కులు ధరిస్తున్నట్లు అప్పటికే వారు చెప్పడంతో మానవుల నుంచి మానవులకు వైరస్ వ్యాప్తి మొదలైనట్లు గ్రహించానన్నారు.
హాంకాంగ్ స్కూల్ ఆఫ్ పబ్లిక్ హెల్త్ యూనివర్సిటీలో వైరాలజీ, ఇమ్యునాలజీ విభాగంలో లి-మెంగ్ యాన్ పరిశోధనలు చేస్తున్నారు. కరోనాపై అధ్యయనం చేసిన తొలి శాస్త్రవేత్తల్లో ఆమె ఒకరు. ఆమె పనిచేస్తున్న యూనివర్సిటీలో ప్రపంచ ఆరోగ్య సంస్థకు చెందిన ల్యాబరేటరీ ఉంది. 2019 డిసెంబర్ చివరిలో విభిన్నంగా ఉన్న సార్స్ మాదిరి వైరస్ కేసులు చైనా నుంచి వ్యాప్తి చెందడాన్ని ఆ ల్యాబ్ గుర్తించింది. ఆ ల్యాబ్కు చెందిన డాక్టర్ లియో పూన్ దీని గురించి అధ్యయనం చేయాలని లి-మెంగ్ యాన్కు సూచించారు. ఈ వ్యాధిని గుర్తించిన అనంతరం విషయాన్ని దాచిపెట్టకుండా చేయాలని ఒత్తిడి చేశారు. ప్రాణభయంతో హాంగ్ కాంగ్ నుంచి అమెరికాకు పారిపోయిన లి-మెంగ్ యాన్ కొన్ని నెలలుగా రహస్య ప్రాంతంలో ఉంటున్నారు.
తాజాగా ఆమె మీడియాతో మాట్లాడుతూ, చైనాలోని తమ సహచరులతో ఈ వైరస్ గురించి చర్చించుకున్నామని, అయితే కొన్ని రోజుల్లోనే వారి గొంతులు మోగబోయినట్లు యాన్ చెప్పారు. దీంతో ఏప్రిల్ 28న యూనివర్సిటీ క్యాంపస్లోని నిఘా కెమెరాల నుంచి తప్పించుకుని విమానంలో అమెరికాకు చేరినట్లు లి-మెంగ్ యాన్ వివరించారు. వైరస్ గురించి వాస్తవాలు చెప్పడానికే తాను అమెరికా వచ్చినట్లు లి-మెంగ్ యాన్ చెప్పారు. తాను ఇక్కడికి రాకుండా ఉండి ఉంటే కొందరు పరిశోధకుల మాదిరిగా జైల్లో ఉండటంతో లేక కనిపించకుండా పోవడంతో జరిగి ఉండేదన్నారు. కేవలం పాస్ పోర్టు, డబ్బుల పర్సుతో హాంగ్ కాంగ్ను వీడి వచ్చానని, తన వారంతా అక్కడే ఉన్నట్లు ఆమె చెప్పారు. హాంగ్ కాంగ్ నుంచి అమెరికాకు వచ్చిన తర్వాత తమ దేశ అధికారులు తన ఇంటికి వెళ్లి తన గురించి తల్లిదండ్రులను ఆరా తీశారని, నేనేదో తప్పు చేసినట్లుగా వారు భావిస్తున్నారని వాపోయారు. ఈ నేపథ్యంలో తన ప్రాణాలకు ముప్పు ఉన్నదని, ఇక ఎప్పటికీ తన దేశానికి, ఇంటికి తిరిగి వెళ్లలేనని, తన వారిని కలుసుకోలేనంటూ ఆమె ఆవేదన చెందారు. కరోనా వైరస్ గురించి చైనా వెల్లడించి ఉంటే ప్రపంచవ్యాప్తంగా అనేక మంది ప్రాణాలతో బయటపడేవారని ఆమె అభిప్రాయపడ్డారు.