అమ్మాయిలను వివిధ సాకులతో బుట్టలో వేసుకునే వ్యభిచార ముఠాల గురించి గతంలో చాలాసార్లు విన్నాం.. ఇతర రాష్ట్రాల్లోని రెడ్ లైట్ ఏరియాల్లో మగ్గిపోతున్న ఆంధ్రా ఆడపిల్లల గురించి కూడా తెలుసుకున్నాం. అయితే ఈ అరాచకం ఇంకా కొనసాగుతూనే ఉందట. ఈ విషయాన్ని సాక్షాత్తూ డీజీపీ గౌతమ్ సవాంగ్ వెల్లడించారు.
అంతే కాదు.. వీరిని ఏఏ కారణాలతో రాష్ట్రం దాటిస్తున్నారు.. వారిని ఎక్కడకు తీసుకెళ్తున్నారు.. ఎక్కువగా ఏ జిల్లాల వారిని ఇలా వ్యభిచారంలోకి దింపుతున్నారో ఆయన వివరించారు. టెర్రరిజం, కరోనా నియంత్రణ, మనుషుల అక్రమ రవాణా అంశాలపై శనివారం జరిగిన దక్షిణాది రాష్ట్రాల డీజీపీలు వీడియో సమావేశంలో సవాంగ్ ఈ షాకింగ్ విషయాలు వెల్లడించారు.
ఎక్కువగా అమ్మాయిలను ఉపాధి కల్పన పేరుతో మోసం చేస్తున్నారట. ఎక్కువగా అనంతపురం, తూర్పుగోదావరి, పశ్చిగోదావరి, కృష్ణా జిల్లాల నుంచి రాష్ట్రం దాటిస్తున్నారట. వీరిలో చాలా మందిని చెన్నై, కోల్కతా నగరాలకు అక్రమంగా తరలిస్తున్నారట. ఈ అక్రమ రవాణాను పూర్తి స్థాయిలో అరికట్టేందుకు చర్యలు తీసుకుంటున్నట్లు సవాంగ్ ఈ మీటింగ్ లో చెప్పారు.
ఈ సమావేశంలో దక్షిణాది రాష్ట్రాలు, పుదుచ్చేరి, లక్షద్వీప్ మధ్య పరస్పర సహకారం, నేరాల నియంత్రణ, సమాచార మార్పిడిపైనా చర్చించారు. ఇంకా తీరప్రాంత భద్రత, గస్తీ, గార్డ్ బోట్ల నిర్వహణకు కేంద్రం నుంచి నిధులు కోరాలని తీర్మానించారు. మాదక ద్రవ్యాల రవాణా, మావోయిజం, ఉగ్రవాద కార్యకలాపాలు, మనుషుల అక్రమ రవాణా, ఇసుక, మద్యం అక్రమ రవాణా నియంత్రణ, నాన్బెయిలబుల్ వారెంట్ల అమలుకు సహకారం, కరోనా నియంత్రణలో రాష్ట్రాల మధ్య సమన్వయంపై డీజీపీలు చర్చించారు.