ఎల్జీ పరిశ్రమలో జరిగిన గ్యాస్ ప్రమాదం 12 మంది వరకూ ప్రాణాలు బలిగొన్న సంగతి తెలిసిందే. ఈ పరిశ్రమలో వాడే స్టైరీన్ వాయువు లీకై చుట్టపక్కల గ్రామాల వారికి నరకం చూపించింది. అయితే ఇంతటి దారుణానికి అసలు కారణాలేంటో ఇప్పుడు వెలుగులోకి వస్తున్నాయి. ఎల్జీ పాలిమర్స్ పరిశ్రమ నిర్వాహకుల నిర్లక్ష్యం ఏ స్థాయిలో ఉందో.. తాజాగా వెలుగు చూసిన ఓ నివేదిక చెబుతోంది.
ఎంత దారుణం అంటే.. పరిశ్రమలో ‘మొలాసెస్ నిల్వ కోసం కట్టిన ట్యాంకును స్టైరీన్ నిల్వకు వినియోగించారట. ఈ ట్యాంకు కట్టి 53 ఏళ్లు దాటినా ఇంకా దాన్నే వాడుతున్నారట. ఎప్పుడో 1967లో కట్టిన ట్యాంకునే స్టైరీన్ నిల్వలకు ఎల్జీ పరిశ్రమ వాడుతోందట. అవి పనికొస్తాయా లేదా అన్న చెకింగ్లు చేయించలేదట. ఈ ట్యాంకు లోపలి భాగంలో లైనింగ్ లేదు. ట్యాంకు లోపలి భాగం తుప్పు పట్టింది కూడా.
అంతేనా.. ఈ ఏడాది ఏప్రిల్ 4 నుంచి 28వ తేదీ వరకూ ట్యాంకులో ఉన్న స్టైరీన్లో పాలిమర్ పరిమాణం అసాధారణంగా పెరుగుతున్నట్లు గమనించినా.. ఎల్జీ యాజమాన్యం పట్టించుకోలేదట. భద్రత కోణంలో చర్యలు తీసుకోలేదట. ట్యాంకు పైభాగంలో పగుళ్లు ఉన్నా లైట్ గా తీసుకున్నారట.
ఇంకా దారుణం అంటంటే.. 2016లో ఎల్జీ పరిశ్రమలో చేపట్టిన తనిఖీల్లో 16 అంశాలను గుర్తించి వాటిని సరిదిద్దాలని సంస్థకు సూచించారట. అయినా వాటి గురించే ఎవరూ ఆలోచించలేదట. మళ్లీ 2019లో తనిఖీ చేసినప్పుడు ఈ తప్పులు గుర్తు చేసినా పట్టించుకోలేదట. అసలు ఈ సంస్థకు పర్యావరణ అనుమతులు లేవట. ఈ తప్పులన్నీ కలిసి స్థానిక జనం ప్రాణాలు తీశాయి.