ఇటీవల లాక్ డౌన్ సడలింపు చేసినప్పటి నుంచి దేశంలో కరోనా వైరస్ ప్రభావం ఏమాత్రం తగ్గడం లేదు. రోజు రోజుకీ పాజటివ్ కేసుల సంఖ్య అంతకంతకూ పెరుగుతూనే ఉంది. సగటున 20వేల కేసులతో పెరుగుతోంది. వరుసగా 8వ రోజు 22 వేలకు పైగా కొత్త కేసులు నమోదవడం గమనార్హం. గడిచిన 24 గంటల్లో కొత్తగా 27,114 పాజిటివ్ కేసులు నమోదయ్యాయి. ఇప్పటివరకు కరోనా బారిన పడి 5,15,385కు చేరగా.. ప్రస్తుతం 2,83,407 మంది కరోనా వైరస్ చికిత్స పొందుతున్నారు. దీంతో కోలుకున్న రోగుల శాతం 62.78గా ఉండడం కొంత ఊరటను కలిగిస్తోంది. గడిచిన 24 గంటల్లో 519 మంది కరోనాతో మరణించారు. దీంతో దేశంలో మొత్తం కరోనా మృతుల సంఖ్య 22,123కు చేరింది.
కరోనాని కట్టడి చేయడం మనపై ఉన్న బాధ్యత అని.. కరోనాకి వ్యాక్సిన్ రాలేదు.. అందుకు మాస్క్, సోషల్ డిస్టెన్స్ పాటించడం చేయాలని అంటున్నారు వైద్యులు. తాజాగా కరోనా కట్టడికి అందరూ కృషి చేయాలని కేంద్ర హోంశాఖ మంత్రి అమిత్ షా పిలుపునిచ్చారు. ప్రభుత్వ నిబంధనలు పాటిస్తూ ముందుకు సాగినప్పుడే కరోనా కట్టడి సాధ్యమని ఆయన స్పష్టం చేశారు. గురుగ్రామ్లోని ఖాదర్పూర్లో కేంద్ర సాయుధ పోలీసు దళాలు ఏర్పాటు చేసిన ‘ఆల్ ఇండియా ట్రీ ప్లాంటేషన్ క్యాంపెయిన్’లో అమిత్ షా పాల్గొన్నారు.
ఈ సందర్బంగా అమిత్ షా మాట్లాడుతూ.. భారత దేశంలో ఉన్న సాంప్రదాయాలు.. ఆహారం తీసుకునే విధానాలు ఎంతో పద్దతిగా ఉంటాయని.. అందులోనే సగం రోగ నిరోదక శక్తి ఉంటుందని అన్నారు. 130 కోట్లకు పైగా జనాభా ఉన్న భారత్ లో కరోనా మహమ్మారిని సమర్ధవంతంగా ఎదుర్కొంటున్నామని ఆయన పేర్కొన్నారు. కరోనా కట్టడికి భద్రతా బలగాలు సైతం విశేష కృషి చేస్తున్నాయని ఆయన కొనియాడారు. కరోనా కట్టడికి కృషి చేస్తున్న యోధులకు తలవంచి వందనం చేస్తున్నానని ఆయన తెలిపారు. కరోనా కట్టడికి పోరాటం చేస్తున్న వైద్యులు, వైద్య సిబ్బంది, పారిశుద్ధ్య సిబ్బంది పోలీసులకు ప్రజలు విధిగా సహకరించాలని ఆయన పేర్కొన్నారు.