తిరుపతి వెంకన్న స్వామి దర్శనం అంటే కోట్ల మంది భక్తులకు అనిర్వచనీయమైన అనుభూతి.. ఈ భక్తిభావానికి రాజు, పేద తేడా ఉండదు.. ఏడాదిలో కనీసం ఒక్కసారైనా తిరుపతి వెళ్లకుండా ఉండలేని భక్తులు శ్రీవారికి కోట్లలోనే ఉంటారు. అందుకే తిరుమల కొండ ఎప్పుడు నిత్య కళ్యాణం పచ్చతోరణంలా కళకళలాడుతోంది.
అయితే ఇప్పుడు కరోనా దెబ్బ శ్రీవారి భక్తులపైనా పడుతోంది. కరోనా కారణంగా భక్తులకు శ్రీవారి దర్శనాల సౌకర్యాన్ని చాలా వరకూ కుదించారు. రోజూ పరిమిత సంఖ్యలోనే ఆన్లైన్లో దర్శనం టికెట్లు పెడుతున్నారు. అయితే ఇప్పుడు చాలా మంది ఆన్ లైన్లో దర్శనం టికెట్లు బుక్ చేసుకుని కూడా... దర్శనానికి డుమ్మా కొట్టేస్తున్నారు.
ఆన్లైన్లో పోటీ పడి టికెట్లు దక్కించుకున్నా కొందరు తిరుమల యాత్ర రద్దుకే మొగ్గు చూపున్నారు. బయటి ప్రాంతాల్లోనూ కేసులు పెరుగుతుండటం.. కంటైన్మెంట్ జోన్లు విస్తృతమవడం ఇందుకు కారణం కావచ్చు.
తిరుమలలో ప్రత్యేక ప్రవేశ దర్శనం ద్వారా తొమ్మిది వేలమంది... సర్వదర్శనం ద్వారా మూడువేల మందికి.. టీటీడీ టికెట్లు అందుబాటులో ఉంచుతోంది. శ్రీవాణి ట్రస్టుకు విరాళాలు అందించిన భక్తులు, ప్రముఖులు, అత్యంత ప్రముఖుల సంఖ్యతో కలిపి రోజుకు పదమూడు వేలకు పైగా మంది శ్రీవారి దర్శనానికి వచ్చేవారు. ఈనెల 10న 12 వేల టికెట్లు జారీ చేస్తే 8 వేల 115 మంది మాత్రమే శ్రీవారి దర్శనానికి వచ్చారు.
శ్రీవారి దర్శనానికి ఆన్లైన్ టికెట్లు బుక్ చేసుకున్నవారిలో రోజుకు సగటున పదిహేను వందల మంది నుంచి రెండు వేల మంది వరకూ రద్దు చేసుకుంటున్నట్లు టీటీడీ చెబుతోంది. పాపం తిరుమల వద్దామని ఎంతో కోరికతో టికెట్లు బుక్ చేసుకుంటున్నా.. ఏ పరిస్థితుల్లో రాలేకపోతున్నారో కానీ.. క్షమించు స్వామీ అని మనసులోనే వేడుకుని ఉంటారు కదా ఆ భక్తులు.