రాజస్థాన్ లో కాంగ్రెస్ ప్రభుత్వం సంక్షోభంలో పడింది. ప్రభుత్వాన్ని కూల్చడానికి బీజేపీ ప్రయత్నిస్తోందని సీఎం గెహ్లాట్ ఆరోపించిన గంటల వ్యవధిలోనే.. డిప్యూటీ సీఎం సచిన్ పైలట్ తన వర్గం ఎమ్మెల్యేలతో హస్తిన చేరడం హాట్ టాపిక్ గా మారింది. మధ్యప్రదేశ్ సీన్.. రాజస్థాన్‌లో కూడా రిపీట్‌ అవుతుందేమోనని కాంగ్రెస్ వర్గాల్లో ఆందోళన మొదలైంది. 

 

రాజ‌స్థాన్‌లో రాజ‌కీయాలు మ‌రోసారి వేడెక్కాయి. డిప్యూటీ సీఎం స‌చిన్ పైల‌ట్ కొందరు ఎమ్మెల్యేలతో ఢిల్లీ చేరడం పలు ఊహాగానాలకు తావిస్తోంది. కాంగ్రెస్ అధినాయకత్వం అపాయింట్ మెంట్ కోసమే సచిన్ పైలట్ వెయిట్ చేస్తున్నారని ఆయన వర్గం చెబుతుంటే.. ఏ క్షణమైనా బీజేపీలో చేరొచ్చనే ప్రచారం ఊపందుకుంది.  సీఎం గెహ్లాట్.. తనను తప్పించే ప్రయత్నాలు చేస్తున్నారని సచిన్ పైలట్ ఇప్పటికే కాంగ్రెస్ అధిష్ఠానానికి ఫిర్యాదు చేశారు. 

 

మధ్యప్రదేశ్‌లో మూడు నెలల కిందట  జ్యోతిరాదిత్య సింథియా తిరుగుబాటు మరువకముందే.. ఇప్పుడు రాజస్ధాన్‌లో ఆయన బాటలో సచిన్‌ పైలట్‌  సాగుతున్న పరిస్థితి కనిపిస్తోంది. అశోక్‌ గెహ్లాట్‌తో సరిపడని సచిన్‌ పైలట్‌ బీజేపీతో సంప్రదింపులు జరుపుతున్నారని తెలుస్తోంది. తనకు 19 మంది ఎమ్మెల్యేల మద్దతు  ఉన్నట్టు ఆయన చెబుతున్నారు. గత మూడు నెలలుగా బీజేపీ శిబిరంతో సచిన్‌ పైలట్‌ వర్గం మంతనాలు జరుపుతోంది. కాగా రాజస్ధాన్‌  ప్రభుత్వాన్ని అస్థిరపరిచే ప్రయత్నాలు సాగించామనే ఆరోపణలతో.. స్పెషల్‌ ఆపరేషన్స్‌ గ్రూప్‌ తనను ప్రశ్నించడంపై సచిన్‌ పైలట్‌ తీవ్ర అసంతృప్తితో ఉన్నారు. శాంతిభద్రతలను పర్యవేక్షించే హోంమంత్రిత్వ శాఖను గెహ్లోట్ పర్యవేక్షిస్తున్నారు. కాగా సచిన్‌ పైలట్‌ ప్రస్తుతం తనకు  మద్దతిచ్చే ఎమ్మెల్యేలతో ఢిల్లీలో ఉన్నారని, ఈ వ్యవహారంపై పార్టీ అధినేత్రి సోనియా గాంధీ ఓ నిర్ణయం తీసుకుంటారని కాంగ్రెస్‌ వర్గాలు  వెల్లడించాయి.

 

అటు సచిన్‌ పైలట్‌కు సీఎం పదవిని ఆఫర్‌ చేసినట్టు వచ్చిన వార్తలను బీజేపీ తోసిపుచ్చింది. కాంగ్రెస్‌లో విభేదాలు ఆ పార్టీ అంతర్గత  వ్యవహారమని వ్యాఖ్యానించింది. సచిన్‌ పైలట్‌ను ప్రశ్నించేందుకు సీఎం అశోక్‌ గెహ్లాట్ ఉత్తర్వులు జారీ చేయడం పట్ల కాంగ్రెస్‌ అధినాయకత్వం విస్మయం వ్యక్తం చేసింది. సచిన్‌ పైలట్‌కు నచ్చచెప్పేందుకు పార్టీ అధిష్టానం చివరినిమిషం వరకూ ప్రయత్నిస్తుందని ఆ పార్టీ  వర్గాలు పేర్కొన్నాయి. పార్టీ రాష్ట్ర చీఫ్‌, ఉప ముఖ్యమంత్రిని విచారణకు హాజరు కావాలని సమన్లు జారీ చేయడం​ఏమిటని సచిన్‌ పైలట్‌  వర్గీయులు మండిపడుతున్నారు. 

 

2018లో జరిగిన రాజస్ధాన్‌ అసెంబ్లీ ఎన్నికల్లో విజయం అనంతరం ముఖ్యమంత్రి పదవికి సచిన్‌ పైలట్‌  పోటీపడగా.. పార్టీ అధిష్టానం సీనియర్‌ నేత అశోక్‌ గెహ్లాట్ వైపు మొగ్గుచూపింది. సచిన్‌ పైలట్‌కు రాష్ట్ర కాంగ్రెస్‌ పగ్గాలు అప్పగించడంతో పాటు ఉప  ముఖ్యమంత్రి పదవిని కట్టబెట్టింది. అయితే గెహ్లాట్, పైలట్ మధ్య విభేదాలు రోజురోజుకీ ముదరడమే ప్రస్తుత పరిస్థితులకు కారణంగా తెలుస్తోంది. 

మరింత సమాచారం తెలుసుకోండి: