ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి అధికారంలోకి వచ్చిన తర్వాత రాష్ట్రంలో మూడు రాజధానులు నిర్మించాలంటూ సంకల్పించిన విషయం తెలిసిందే. అనుకున్నదే తడవుగా దీనికి సంబంధించిన బిల్లును ఏకంగా అసెంబ్లీలో ఆమోద ముద్ర వేయించి.. శాసన మండలికి పంపగా అక్కడ జగన్ సర్కార్ కు ఎదురుదెబ్బ తగిలింది. ప్రస్తుతం శాసనమండలిలో టిడిపి పార్టీకి ఎక్కువ సంఖ్యాబలం ఉండటం... వైసీపీ కి తక్కువ మంది సభ్యులు ఉండటంతో సర్కార్ తీసుకొచ్చిన వికేంద్రీకరణ, సీఆర్డీఏ రద్దు బిల్లులను శాసనమండలి వ్యతిరేకించింది. దీనిపై తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేసిన ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి ఏకంగా శాసన మండలి రద్దు చేస్తూ నిర్ణయం తీసుకోవటం సంచలనం సృష్టించింది.
అయితే దీనికి సంబంధించిన మండలి రద్దు బిల్లు ఏపీ అసెంబ్లీ లో ఆమోదం పొంది ప్రస్తుతం పార్లమెంటుకు చేరింది. ఈ నేపథ్యంలో ఎంతో మంది నేతలు పైకి జగన్ నిర్ణయానికి సమర్థించినప్పటికీ లోలోపల మాత్రం ఎంతో బాధ పడ్డారు అనే చెప్పాలి. ఇదిలా ఉంటే శాసన మండలి రద్దు విషయంలో ఏపీ ముఖ్యమంత్రి వైయస్ జగన్మోహన్ రెడ్డి మనసు మార్చుకున్నారా..? మండలి రద్దు విషయంలో వెనక్కి తగ్గారా..? అంటే అవుననే సమాధానమే ఎక్కువగా వినిపిస్తోంది.
ఇందుకు కారణం తాజాగా ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి తీసుకున్న నిర్ణయాలే... అయితే ఇటీవలే ఇద్దరి ఎమ్మెల్సీల పదవీకాలం పూర్తి అవడం తో పాటు గవర్నర్ కోటా కింద ఉన్న ఎమ్మెల్సీల పదవీకాలం కూడా పూర్తయింది. అయితే ఇటీవలే డొక్కా మాణిక్య వర ప్రసాద్ ను ఎమ్మెల్సీగా జగన్ సర్కార్ నిర్ణయించిన విషయం తెలిసిందే,. ఇక తాజాగా గవర్నర్ కోటా నామినేషన్ లో మాజీ ఎమ్మెల్యే రాజశేఖర్ పేరుని ఎమ్మెల్సీగా కన్ఫార్మ్ చేసింది జగన్ సర్కార్, అయితే ఇలా ఎమ్మెల్సీ పదవి కేటాయించడంతో.. మండలి రద్దు విషయంలో జగన్ మనసు మార్చుకున్నారు అనే వాదన ప్రస్తుతం ఎక్కువగా వినిపిస్తుంది.మరి రాబోయే రోజుల్లో ఏం జరుగుతుంది అనేది చూడాలి మరి.