ప్రస్తుత పరిస్దితుల్లో ప్రజలంతా అయోమయంలో బిక్కు బిక్కు మంటూ రోజులు వెళ్లదీస్తున్నారు. ఒక వైపు బీభత్సంగా వ్యాపిస్తున్న కరోనా వైరస్ మరో వైపు ఎప్పుడు ప్రభుత్వం నుండి ఏ మాట వినవలసి వస్తుందో అనే భయం.. ఇంట్లో నుండి కాలు బయటపెడితే కరోనా అనే కాలుడు ఆవహిస్తాడనే టెన్షన్ మనుషులకు నిదురలేకుండా చేస్తుందట.. ఈ దశలో ఇదివరకే కొన్ని రాష్ట్రాలు స్వయంగా లాక్డౌన్ ప్రకటించుకున్నాయి.. మరికొన్ని రాష్ట్రాలు లాక్డౌన్ ప్రకటిస్తే వచ్చే కష్టాలను ఎదుర్కొన లేక ఏదైతే అదికానీ అంటూ మొండిగా ముందుకు సాగుతున్నాయి..
ఇక లాక్డౌన్ ప్రకటించినా, ప్రకటించక పోయినా ప్రజలు మాత్రం కష్టాలు అనుభవించక తప్పదు.. ఇప్పటికే కరోనా బారిన పడుతున్న వారి సంఖ్య రోజు రోజుకు పెరుగుతుండటంతో బీహార్ ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది.. ఈ వైరస్ వ్యాప్తి దృష్టిలో ఉంచుకుని బీహార్లోని జహనాబాద్లో లాక్డౌన్ అమలు చేయాలని జిల్లా యంత్రాంగం నిర్ణయించింది. ఇందులో భాగంగా జూలై 13 నుంచి 17 వరకూ జిల్లాలో లాక్డౌన్ విధిస్తున్నామని డీఎం నవీన్ కుమార్ పేర్కొన్నారు.. ఈ సమయంలో ప్రజలకు అవసరమైన సేవలు అందేలా అధికారులు తగిన చర్యలు తీసుకోవడమే కాదు, కోవిడ్ -19 రెగ్యులేషన్స్- 2020 లో ఉన్న సెక్షన్ 17,18 లోని అధికారాలను ఉపయోగించి పండ్లు, కూరగాయలు, పాలు మొదలైన ప్రజలకు నిత్యావసరాలు అందించే దుకాణాలు మాత్రం తెరచి ఉండేలా చర్యలు తీసుకుంటున్నామని వెల్లడించారు..
ఇకపోతే జిల్లాలో లాక్డౌన్ ముగిసిన తరువాత కరోనా సోకిన వారి సంఖ్య పెరుగుతోందని, గత మూడు వారాల్లో జిల్లాలో కరోనా సోకిన వారి సంఖ్య అత్యధికంగా ఉందని డీఎం తెలిపారు. కరోనా వ్యాప్తిని నివారించడానికి ఆదేశాలు జారీ చేసినప్పటికీ, ప్రజలు మాస్కులు ధరించడం లేదని, సామాజిక దూరాన్ని పాటించకుండా బాధ్యతారాహిత్యంగా ప్రవర్తిస్తున్నారని తెలిపారు.. కరోనా విషయంలో ముఖ్యంగా ప్రజలు వైద్యాధికారుల సూచలను పాటిస్తే దీన్ని జయించవచ్చని అలా కాదని ఇష్టారీతిగా వ్యవహరిస్తే భారీ నష్టాన్ని చూడవలసి వస్తుందని, ఈ విషయాన్ని ప్రజలు అర్ధం చేసుకోవాలని విన్నవించారు..