ఏపీ సీఎంగా జగన్ అధికారంలోకి వచ్చాక.. అంతా గ్రామాల కేంద్రంగానే పనులు జరిగేలా చర్యలు తీసుకుంటున్నారు. ఇందుకు తాను స్వయంగా ఏర్పాటు చేసిన గ్రామ సచివాలయ వ్యవస్థను వాడుకుంటున్నారు. ఏదైనా పల్లె కేంద్రంగానే జరగాలన్న లక్ష్యంలో నుంచి పుట్టుకొచ్చినవే.. గ్రామ సచివాలయాలు, గ్రామ వాలంటీరు వ్యవస్థలు. ఇప్పటికే ఫించన్లు, రేషన్ సరుకులు జనం ఇళ్ల ముందుకు వచ్చేశాయి.
ఇక ఇప్పుడు మరో సేవను జగన్ గ్రామాలకు తీసుకొస్తున్నారు. అదే.. భూములు, స్థలాల రిజస్ట్రేషన్ సేవలు.. త్వరలోనే గ్రామ, వార్డు సచివాలయాల్లో భూములు, స్థలాల రిజిస్ట్రేషన్ ప్రక్రియలు ప్రారంభం కాబోతున్నాయి. ఈ నెల 15, 16 తేదీల్లో గ్రామ, వార్డు సచివాలయాల్లో భూములు, స్థలాల రిజిస్ట్రేషన్ ప్రక్రియలు ప్రారంభిస్తారు. అయితే ఈ ప్రక్రియ మొదట ప్రయోగాత్మకంగా చేపడతారు.
మొదటగా ఈ కార్యక్రమాన్ని గుంటూరు జిల్లా కాజ సచివాలయంలో ప్రారంభిస్తారు. ఈ కార్యక్రమంలో వచ్చే ఇబ్బందులు, సౌకర్యాలు పరిశీలిస్తారు. ఇక్కడ పరిశీలన అనంతరం రాష్ట్రంలోని మిగిలిన చోట్ల రిజిస్ట్రేషన్ల ప్రక్రియకు శ్రీకారం చుడతారు. ప్రయోగాత్మక కార్యక్రమం కావడంతో సబ్రిజిస్ట్రార్ ఆధ్వర్యంలోనే సచివాలయంలో ఈ ప్రక్రియ నిర్వహిస్తారు.
రిజిస్ట్రేషన్ ప్రక్రియ అంతా సబ్ రిజిస్ట్రార్ ఆధ్వరంలోనే జరిగినా... అదనపు సేవలకు మాత్రం సచివాలయం సిబ్బంది సేవలు వాడుకుంటారు. దస్తావేజుకు సంబంధించిన చెక్స్లిప్లు కొట్టడానికి, మార్కెట్ ధరలు పక్కాగా నమోదు చేశారా? లేదా? అనేవి పరిశీలించేందుకు వీరిని ఉపయోగించుకుంటారు. కాజలో ఈ ప్రయోగం సక్సస్ అయితే.. ఇక దీన్ని రాష్ట్రమంతా ప్రారంభిస్తారు.