గ్యాంగ్స్టర్ వికాస్ దుబే.. ఇటీవల వార్తల్లో బాగా నానిన పేరు.. ఏకంగా పోలీసులపైనే కాల్పులు జరపడం.. 8 మంది వరకూ పోలీసులనే విచక్షణారహితంగా కాల్చిచంపడం.. ఆ తర్వాత ఎన్ కౌంటర్లో వికాస్ దుబే కూడా హతుడు కావడం ఇటీవల సంచలనం సృష్టించిన సంగతి తెలిసిందే.
ఇప్పుడు ఈ వికాస్ దుబే ఎన్ కౌంటర్ విషయంపై విచారణ కోసం ఉత్తర ప్రదేశ్ ప్రభుత్వం ఓ కమిషన్ ను నియమించింది. ఇది ఏకసభ్య కమిషన్.. అంటే ఇందులో ఒక్కరే సభ్యుడు ఉంటారు. ఆయన ఇచ్చే నివేదిక కీలకం అవుతుంది. ఈ నెల 2న దుబే ముఠా 8 మంది పోలీసులను కాల్చి చంపిన ఉదంతం... ఆ తర్వాత దుబే ఎన్కౌంటర్ ఘటనపై ఈ ఏకసభ్య కమిషన్ విచారణ జరుపుతుంది.
ఈ ఏకసభ్య కమిషన్ కింద నియమితులైన వ్యక్తి అలహాబాద్ హైకోర్టు మాజీ న్యాయమూర్తి జస్టిస్ శశికాంత్ అగర్వాల్. అయితే ఈ దుబే ముఠాతో స్థానిక పోలీసులు కూడా కుమ్మక్కయ్యారని.. ఆరోపణలు ఉన్నాయి.. దీనిపై యూపీ సర్కారు ఓ సిట్ ను ఏర్పాటు చేసింది. విశేషం ఏంటంటే.. ఈ సిట్లో ఓ ఐపీఎస్ అధికారి మన తెలుగు ఐపీఎస్. పేరు రవీందర్ గౌడ్.. ఈయన స్వస్థలం ఉమ్మడి మహబూబ్నగర్ జిల్లా.
ఆయన 2005వ సంవత్సరం ఐపీఎస్ బ్యాచ్ అధికారి. ప్రస్తుతం ఆయన యూపీ క్యాడర్లో డీఐజీ హోదాలో పనిచేస్తున్నారు. ఇప్పుడు ఈ వికాస్ ఎన్ కౌంటర్ విచారణలో ఆయన కీలక పాత్ర పోషించబోతున్నారు. ఈ సిట్ 8 మంది పోలీసులను దుబే ముఠా కాల్చి చంపిన కాన్పుర్ సమీపంలోని బిక్రూ గ్రామాన్ని సందర్శించింది.