తెలంగాణలో కరోనా మహమ్మారి విజృంభణ కొనసాగుతోంది. కొత్తగా 1,269 మందికి కరోనా నిర్ధారణ అయింది. దాంతో మొత్తం కేసుల సంఖ్య 34,671కి చేరింది. జీహెచ్ఎంసీ పరిధిలో 800 కొత్త కేసులు వచ్చాయి. ముఖ్యంగా గత కొన్ని రోజులుగా హైదరాబాద్ లో కరోనా వైరస్ బీభత్సం సృష్టిస్తుంది. హైదరాబాద్ లో కరోనా శరవేగంగా విజృంభిస్తోంది. ప్రతి గంట వ్యవధిలో కొత్తగా 49 మంది వైరస్ బారిన పడుతున్నారు. అంటే రోజులో సగటున 1169 కేసులు ఒక్క హైదరాబాద్ పరిధిలోనే వస్తున్నాయి. ఈ నెల 3 నుంచి 8 మధ్య రోజుకు 1,270 నుంచి 1,660 వరకూ కేసులు రాగా, ఆపై మాత్రం రోజుకు 1,000 కేసుల లోపే వస్తున్నాయి. తొలివారంలో రికార్డు స్థాయిలో నమోదైన కేసుల వేగం, ఇప్పుడు దాదాపు సగానికి తగ్గింది.
మొత్తం మీద గత 13 రోజుల్లో ఏకంగా 14,033 కేసులు వచ్చాయి. ఇటీవల కాలంలో ప్రజా ప్రతినిధులకు కరోనా కేసులు నమోదు అవుతున్న విషయం తెలిసిందే. ఈ నేపథ్యంలో కరోనా వైరస్ పాజిటివ్తో మరో కాంగ్రెస్ నేత మృతి చెందారు. తాజాగా హైదరాబాద్కు చెందిన కాంగ్రెస్ నేత జి నరేందర్ రెడ్డి కరోనా వైరస్తో మృతి చెందారు. ఇటీవలే కోవిడ్ బారిన పడ్డ రోగులకు అందించే సహాయ కార్యక్రమాల్లో పాల్గొన్నారు నరేందర్ యాదవ్.
అనంతరం ఆయన కూడా తీవ్ర అస్వస్థతకు గురయ్యారు. ఆస్పత్రికి తరలించగా కరోనా వైరస్ సోకినట్టు వైద్యులు పేర్కొన్నారు. అనంతరం చికిత్స పొందుతూ మృతి చెందారు. ఇప్పుడు నరేందర్ ఎవరెవరితో కాంటాక్ట్ అయ్యారో వారికి కూడా టెస్టులు చేస్తున్నారు వైద్యులు. కాగా నరేందర్ మృతికి పలువురు కాంగ్రెస్ నాయకులు సంతాపం వ్యక్తం చేశారు.