ఈ మద్య ఏపిలో వర్షాలు బీభత్సం సృష్టించిన విషయం తెలిసిందే. వరద నీటితో చెరువులు, కాల్వలు పొంగి పొర్లాయి.  ఈ నేపథ్యంలో మురుగునీటి డ్రైన్‌ చిన్నారి ప్రాణాల పాలిట మృత్యువుగా మారింది. పాల ప్యాకెట్‌ కోసం వెళ్లిన చిన్నారి వచ్చేస్తుందని ఎదురు చూస్తున్న కన్నవారికి తీరని కడుపు కోత మిగిల్చింది. బాలికను కాపాడేందుకు పెద్ద ఎత్తున స్థానికులు డ్రైన్‌లో గాలించినా ఫలితం లేకపోయింది. తూర్పుగోదావరి జిల్లా మండపేట పట్టణానికి చెందిన చెందిన పలివెల దుర్గాప్రసాద్, పల్లవి దంపతులకు కుమార్తె చంద్రకళ(7), కుమారుడు ఉన్నారు. అద్దె ఇంటిలో ఉంటున్న దుర్గాప్రసాద్‌ వడ్రంగి పని చేస్తూ తన కుటుంబాన్ని పోషించుకుం టున్నాడు. ఈ నేపథ్యంలో ఇటీవల భారీ వర్షాలకు అక్కడ డ్రైనేజ్ లు పొంగి పొర్లుతున్నాయి.

 

పాల ప్యాకెట్‌ కోసం పోలీస్‌స్టేషన్‌ సమీపంలోని దుకాణం వద్దకు వచ్చింది. అప్పటికే కుంభవృష్టిగా కురిసిన వర్షంతో దుకాణం సమీపంలోని మంగళిబోదె డ్రైన్‌ వేగంగా ప్రవహిస్తోంది. ఆ నీటి ప్రవాహంలో చిన్నారికి ఏమీ అర్థం కాలేదు. రోడ్డుపై నుంచి ముంపునీరు ప్రవహిస్తుండడంతో నీటిలో కాలి చెప్పు జారిపోయింది. దానిని తీసుకునే ప్రయత్నంలో చంద్రకళ నీటి ప్రవాహ వేగానికి డ్రైన్‌లో పడి కొట్టుకుపోయింది. అక్కడే ఉన్న మరో ఇద్దరు చిన్నారు వెంటనే చంద్రకళ ఇంటికి వెళ్లి ఆమె తల్లి చెప్పారు. వెంటనే పరుగెత్తుకుంటూ సంఘటన స్థలానికి చేరుకుంది.

 

తన బిడ్డను కాపాడమంటూ ఆమె డ్రైన్‌ వెంబడి పరుగులు పెట్టడం చూసి స్థానికులు పెద్ద ఎత్తున డ్రైన్‌లోకి దిగి గాలింపు చర్యలు చేపట్టారు. కిలోమీటరు దూరంలో చిన్నారి దొరకడంతో హుటాహుటిన స్థానిక ప్రభుత్వ ఆస్పత్రికి తీసుకురాగా అప్పటికే ఆ చిన్నారి మృతి చెందినట్టు వైద్యులు నిర్ధారించారు. కాగా, మున్సిపల్‌ కమిషనర్‌ టి.రామ్‌కుమార్‌ సంఘటన స్థలానికి చేరుకుని పరిశీలించారు. పట్టణ పోలీసులు కేసు నమోదుచేసి దర్యాప్తు చేస్తున్నారు.  ఎంతో అల్లారు ముద్దుగా పెంచుకున్న తమ కూతురు కళ్ల ముందు చనిపోవడంతో దుఖఃసంద్రంలోమునిగిపోయారు కుటుంబ సభ్యులు. 

మరింత సమాచారం తెలుసుకోండి: