రాజకీయాలు ఎప్పుడు ఎలా మారతాయో ఎవ్వరూ ఊహించలేరు. ఇప్పుడు గాలి ముద్దుకృష్ణమనాయుడు కుటుంబంలోనూ అదే జరుగుతోంది. తెలుగు దేశం పార్టీలో సీనియర్ నాయకుడిగా పలు పదవులు నిర్వహించిన గాలి ముద్దుకృష్ణమ నాయుడు.. 1983లో ఎన్టీఆర్ టిడిపిని ఏర్పాటు చేసిన సమయంలో ఈయన ఎన్టీఆర్ పిలుపు మేరకు పార్టీలో చేరారు. ఎన్టీఆర్ మంత్రివర్గంలో గాలి ముద్దుకృష్ణమనాయుడు అటవీ, ఉన్నత విద్యాశాఖ మంత్రిగా పనిచేశారు. అలాగే చిత్తూరు జిల్లా పుత్తూరు, నగరి అసెంబ్లీ స్థానాల నుండి గాలి ముద్దుకృష్ణమనాయుడు ఆరుసార్లు అసెంబ్లీకి ఎన్నికయ్యారు.
అయితే 2014 ఎన్నికల్లో మాత్రం ఆర్కే. రోజా చేతిలో ఓడిపోయారు. దీంతో టీడీపీ అదినేత చంద్రబాబు ఆయనకు ఎమ్మెల్సీ పదవి కట్టపెట్టారు. కానీ, ఆ కొంత కాలానికి ముద్దుకృష్ణమనాయుడు అనారోగ్యం కారణంగా మృతి చెందారు. ఈ క్రమంలోనే ముద్దుకృష్ణమనాయుడకు ఎమ్మెల్సీ పదవి కోసం ఆయన కుమారులు ఇద్దరు, సతీమణి సరస్వతమ్మ కూడా రోడ్డెక్కారు. అయితే చివరకు చంద్రబాబు రస్వతమ్మకు ఎమ్మెల్సీ ఇచ్చి.. గత ఏడాది ఎన్నికల్లో నగరి టికెట్ను గాలి కుమారుడు భాను ప్రకాశ్ కు ఇచ్చారు.
అయితే ఆయన రోజా చేతుల్లో ఓటమి పాలయ్యారు. ఇక ప్రస్తుతం గాలి కుటుంబానికి మిగిలిన ఏకైక రాజకీయ పదవి.. ఆయన సతీమణి ఎమ్మెల్సీ కావడమే. అది కూడా వచ్చే ఏడాది మార్చి 21తో పదవీ కాలం ముగుస్తుంది. ఇక ఆమె ఈ పదవిని వదులుకుంటే.. ముద్దు కృష్ణమ నాయుడు కుటుంబానికి రాజకీయంగా ఎలాంటి పదవులు ఉండవు. మళ్లీ వచ్చే 2024 ఎన్నికల వరకు వెయిట్ చేయాల్సిందే. అయితే అప్పుడు కూడా గాలి ఫ్యామిలీ ఎన్నికల బరిలో నిలిస్తే.. ఎమ్మెల్యే రోజా దూకుడు ముందు గెలవడం కష్టమనే అంటున్నారు. మరోవైపు తల్లీ కుమారుల మధ్య సఖ్యత కూడా సరిగ్గా లేదు. మరి ఇలాంటి క్లిష్ట పరిస్థితుల్లో గాలి కుటుంబం వైఎస్ఆర్సీపీ ఫ్యాన్ గాలిని తట్టుకుంటుందా..? లేక ఓడిపోయి అడ్రస్ లేకుండా పోతుందా? అన్న ప్రశ్నలు ఇప్పుడు హాట్ టాపిక్గా మారాయి. ఏదేమైనా పదవి పేరు చెప్తేనే గాలి ఫ్యామిలీ భయపడుతుందని కొందరు అభిప్రాయపడుతున్నారు.