ప్రపంచంలో ప్రస్తుతం ఎవరి నోట విన్నా ఒక్కటే మాట కరోనా. చైనాలోని పుహాన్ లో పురుడు పోసుకున్న ఈ దిక్కుమాలిన కరోనా వైరస్ ప్రపంచం మొత్తం విస్తరించి అతలాకుతలం చేస్తుంది. ఇప్పటి వరకు కనీ వినీ ఎరుగని రీతిలో మరణాలు, కేసులు పెరిగిపోతున్నాయి. అగ్రరాజ్యం సైతం కరోనా పేరు చెబితే భయంతో వణికిపోయే పరిస్థితి నెలకొంది. అగ్రరాజ్యంలో కరోనా విలయతాండవం కొనసాగుతూనే ఉంది. ఇప్పటికే కరోనా కేసులలో ప్రపంచంలో అగ్రస్థానంలో ఉన్న అమెరికాలో గత ఐదు రోజులుగా రోజుకు 60 వేలకు పైగా కేసులు నమోదవుతున్నాయి.
ఆదివారం ఒక్క రోజే ప్రపంచ వ్యాప్తంగా 2,30,000 కరోనా వైరస్ పాజిటివ్ కేసులు నమోదు అయినట్లు ప్రపంచ ఆరోగ్య సంస్థ పేర్కొన్నది. అమెరికాలోనే అత్యధిక స్థాయిలో కేసులు నమోదు అయినట్లు తెలుస్తున్నది. ఆ దేశంలో అత్యధికంగా 1,42,992 కేసులు నమోదు అయ్యాయి. తాజాగా గడిచిన 24 గంటల్లో అమెరికాలో 60 వేలకు పైగా కేసులు నమోదయ్యాయి. 442 మంది మరణించారు. ఫ్లోరిడాలో రికార్డుస్థాయిలో ఒక్కరోజులో 15,299 కరోనా కేసులు నమోదయ్యాయి. అయితే ఎక్కువ టెస్ట్లు చేస్తున్న కారణంగా ఇన్ని కేసులు నమోదవుతున్నట్లు తెలుస్తోంది. దానికి తోడు ప్రజలెవరు కరోనా మార్గదర్శకాలు పాటించకుండా రోడ్లపై స్వేచ్చగా తిరుగుతుండటం కూడా ఫ్లోరిడాలో ఈ సంఖ్యలో కేసులు పెరగడానికి ఒక కారణంలాగా చెబుతున్నారు.
ఇప్పటి వరకు అగ్రరాజ్యంలో 3,413,995 మంది పడగా, 1,37,782 మంది మరణించారు. 1,517,084 కరోనా వైరస్ బారి నుంచి కోలుకున్నారు. ప్రపంచ మొత్తం చూస్తే అత్యధిక స్థాయిలో మరణాలు కూడా అమెరికాలోనే సంభవించాయి. ఇప్పటి వరకు ప్రపంచ వ్యాప్తంగా 12.9 మిలియన్ల కేసులు నమోదు అయ్యాయి. ఇక భారతదేశం విషయానికి వస్తే ఇప్పటి వరకు నమోదయైన కరోనా కేసుల సంఖ్య 879,466 ఉండగా, 23,187 మంది మరణించారు.554,429 మంది కరోనా నుంచి కోలుకున్నారు.