కరోనాకు వ్యాక్సీన్ ఇంకా రాలేదు.. ఇప్పటి వరకూ వివిధ రకాల మందులు మాత్రం ఇవి కరోనాకు బాగా పని చేస్తాయని అనేక కంపెనీలు విడుదల చేశాయి. వీటిలో టాబ్లెట్లు ఉన్నాయి.. కొన్ని ఇంజక్షన్లు కూడా ఉన్నాయి. అయితే దేశంలో అందరి కంటే ముందు కరోనా మందు విడుదల చేశామని గ్లెన్ మార్క్ అనే ఫార్మా కంపెనీ చెప్పుకున్న సంగతి తెలిసిందే కదా.
గ్లెన్ మార్క్ సంస్థ ఫాబిఫ్లూ బ్రాండ్ పేరుతో కొవిడ్-19 చికిత్సకు ఈ టాబ్లెట్లు మార్కెట్లోకి విడుదల చేసింది. ఈ టాబ్లెట్ను స్వల్ప, మోతాదు కరోనా లక్షణాలున్న బాధితులకు వినియోగిస్తున్నారు. ఈ ఫవిపిరవిర్ ఔషధం ధరలను ఇప్పుడు సదరు గ్లెన్మార్క్ ఫార్మాసూటికల్స్ కంపెనీ భారీగా తగ్గించేసింది. ఏకంగా 27% వరకు ధర తగ్గించింది.
ఈ తగ్గింపు కారణంగా.. రూ.103 బదులు రూ.75కే వినియోగదారులకు ఈ టాబ్లెట్ అందుబాటులోకి వస్తోంది. ఈ ధర తగ్గింపునకు ఉన్న కారణం కూడా ఆ సంస్థ ప్రకటించింది. భారత్లోని గ్లెన్మార్క్ కేంద్రాల్లో అత్యుత్తమ పద్ధతుల్లో ఔషధాలను తయారు చేస్తుండటంతో ధర తగ్గించేందుకు వీలు కలిగిందని చెప్పింది.
అందుకే ఈ ప్రయోజనాలను దేశంలోని బాధితులకు బదిలీ చేస్తున్నామని ఆ సంస్థ ఓ ప్రకటనలో తెలిపింది. ఇప్పుడు ఈ మందు పని తీరుపై కూడా ఆ సంస్థ సర్వే చేయిస్తోందట. 1000 మందిపై పరిశోధన చేసి ఔషధం పనితీరు, సామర్థ్యాన్ని తెలుసుకుంటారట. ఏదైనా ధర తగ్గడం కాస్త రోగులకు ఉపశమనమే కదా.