హిందువుల ఆరాధ్య దైవం శ్రీరాముడిపై మరో వివాదం మొదలైంది. ఆయన జన్మస్థలం అయోధ్య అన్న సంగతి తెలిసిందే. ఇది అయోధ్యలో ఉందన్న సంగతీ తెలిసిందే.. అయితే ఇప్పుడు రాముడు మా వాడే అంటోంది నేపాల్ దేశం. గతంలో ఈ దేశం సీతా దేవి మా దేశ యువరాణే అని వివాదం సృష్టించింది కూడా.
ఈ కొత్త వివాదానికి నేపాల్ ప్రధాని కె.పి.శర్మ ఓలి శ్రీకారం చుట్టారు. శ్రీరాముడు నేపాల్ కు చెందిన వాడేనట. అసలు నేపాల్లో ఉన్న అయోధ్యే అసలైన అయోధ్య అట. అదే సమయలో అసలు అయోధ్య నేపాల్ లోనే ఉందంటున్నాడాయన. శ్రీరాముడి జన్మస్థానం దక్షిణ నేపాల్లోని థోడిలో ఉందట.
ఇంతకీ ఇప్పుడు ఈ ఇష్యూ ఎందుకు తెరపైకి వచ్చిందంటారా.. వాల్మీకి రామాయణాన్ని నేపాలీలోకి అనువదించిన కవి భానుభక్త జయంతి కార్యక్రమం సోమవారం జరిగింది. ఈ సభకు హాజరైన ఓలి ఈ వ్యాఖ్యలు చేశారు. నిజమైన అయోధ్య నేపాల్లో బిర్గుంజ్కు పశ్చిమాన ఉన్న థోడీలో ఉందన్నారు.
అక్కడే రాముడు జన్మించాడట. రాముడి జన్మస్థానం భారత్లోని అయోధ్యేనని భారతీయులు చేస్తున్న వాదన తప్పట. అంతే కాదు.. భారత్లోని అయోధ్యపై వివాదం ఉంది. కానీ నేపాల్లోని అయోధ్యపై ఎలాంటి వివాదం లేదని కొత్త పల్లవి అందుకున్నారు ఓలి.