కరోనా భయంతో ఇప్పడు సమస్త మానవాళి వణికిపోతోంది. రాజూపేద తేడా లేకుండా అందరికీ కరోనా వచ్చేస్తోంది. ప్రపంచవ్యాప్తంగా ఇప్పటికే 5 లక్షల మంది ఈ మహమ్మారికి బలైపోయారు. ఇండియాలో రోజూ కనీసం 500 మంది ఈ వ్యాధి కారణంగా కన్నుమూస్తున్నారు. ఈ వ్యాధి భయం ఎప్పుడు పోతుందో కూడా తెలియని దుస్థితి నెలకొంది.
ఇలాంటి పరిస్థితుల్లో ఇది నిజంగా గుడ్ న్యూస్ అనే చెప్పాలి. అదేటంటే.. మన ఒంట్లో కరోనాను ఎదుర్కొనే శక్తి పురుడుపోసుకుంటోందట. స్వీడన్ లోని ఓ యూనివర్శిటీ అధ్యయన ఫలితాలు ఈ విషయం చెబుతున్నాయి. కొవిడ్ లక్షణాలు మధ్యస్థంగా, అసలే లేని వారిలో చాలామంది కరోనాను ఎదుర్కొనే టి కణ మాధ్యమ రోగనిరోధకశక్తి కలిగి ఉంటున్నట్టు కరోలిన్స్కా ఇన్స్టిట్యూట్, కరోలిన్స్కా యూనివర్సిటీ హాస్పిటల్ పరిశోధకులు కనిపెట్టారు.
దీన్ని పరిశోధన ద్వారా నిరూపించారు కూడా. మరో విశేషం ఏంటంటే.. రక్తంలో యాంటీబాడీలు కనిపించకపోయినా కణ మాధ్యమ రోగనిరోధకశక్తి ఉంటోంది. యాంటీబాడీ పరీక్షలు సూచిస్తున్నదాని కన్నా కరోనా రోగనిరోధక శక్తి మరింత ఎక్కువగా ఉంటోంది. వైరస్ సోకిన కణాలను పసిగట్టి, దాడికి పురికొల్పేవి తెల్లరక్త కణాల్లోని టి కణాలు.. ఇవి గుర్తించగలిగిన స్థాయిలో యాంటీబాడీలు గలవారి సంఖ్యతో పోలిస్తే అంతకన్నా రెట్టింపు మందిలో టి-కణ రోగనిరోధకశక్తి అభివృద్ధి చెందినట్టు కనిపిస్తోందట.
వీరిలోనే కాదు, కరోనా లక్షణాలు లేని వీరి కుటుంబ సభ్యుల్లోనూ ఈ నిరోధక శక్తి బయటపడుతోందట. అంటే మనకు కరోనాను ఎదిరించే శక్తి ఆటోమేటిగ్గా వచ్చేస్తోందన్నమాట.. కరోనా వణికిపోతున్న సమయంలో ఈ న్యూస్ చాలా ఊరట కలిగిస్తోంది.