తెలంగాణ సర్కారు కరోనా కేసుల లెక్కలను తప్పులతడకగా చెబుతోందా.. వేల కరోనా కేసులను దాచేస్తోందా.. కేసులనే కాదు.. ఏకంగా మృతుల సంఖ్యను కూడా తక్కువ చేసి చూపుతోందా.. ఏకంగా రోజూ నమోదవుతున్న కేసుల్లో సగం మాత్రమే బులెటిన్లో ప్రకటిస్తున్నదా.. ఈ ప్రశ్నలకు అవునంటూ సమాధానం చెబుతోంది ఓ తెలంగాణ దిన పత్రిక.
తెలంగాణ సర్కారు వేల సంఖ్యలో కేసులను, వందల సంఖ్యలో మరణాలను దాచి పెడుతున్నదని తెలంగాణ దిన పత్రిక వెలుగు ఓ సంచలన కథనాన్ని ప్రచురించింది. సోమవారం సాయంత్రానికి రాష్ట్రంలో 42,685 కేసులు నమోదయ్యాయని.. కానీ రాష్ట్ర ఆరోగ్య శాఖ మాత్రం బులెటిన్లో 36,221 కేసులే చూపించిందని చెబుతోంది.
తెలంగాణ సర్కరాు ఏకంగా సుమారు 6,464 కేసులను ప్రకటించలేదట. కరోనా పాజిటివ్ వచ్చిన ప్రతి వ్యక్తి వివరాలను హెల్త్ డిపార్ట్మెంట్ పోర్టల్లో అప్లోడ్ చేస్తారని.. అప్లోడ్ చేసిన వెంటనే ఆర్డర్ ప్రకారం ఓ నంబర్ కేటాయిస్తారని వెలుగు చెబుతోంది. అట్ల సోమవారం పాజిటివ్గా తేలిన 19 ఏండ్ల ఓ అమ్మాయికి 42,684 నంబర్ కేటాయించారని... 44 ఏండ్ల ఓ వ్యక్తికి 42,685 నంబర్ కేటాయించారని తన పత్రికలో రాసింది.
సోమవారం సాయంత్రం 5 గంటల వరకూ ఈ లెక్క ఉంటే.. అదే టైమ్తో పబ్లిక్ హెల్త్ డైరెక్టర్ రిలీజ్ చేసిన హెల్త్ బులెటిన్లో కేవలం 36,221 వేల కేసులు నమోదైనట్టుగా చూపించారని బయటపెట్టింది. ఇలా వేల సంఖ్యలో కేసులను దాచి పెడుతూ, కేసులన్నీ బయటపెడితే ప్రజలు ఆందోళనకు గురవుతారంటూ సాకులు చెబుతున్నారని అంటోంది. మరి ఈ కథనమే నిజమైతే ప్రభుత్వం ప్రజలను తప్పుదారి పట్టిస్తున్నట్టే లెక్క.. దీనిపై ప్రభుత్వం వివరణ ఇస్తే బావుంటుంది.