చైనాలోని పుహాన్ లో పురుడు పోసుకున్న కరోనా వైరస్ ఇప్పుడు ప్రపంచం మొత్తానికి మనశ్శాంతి లేకుండా చేస్తుంది. భారత్లో కరోనా ఉద్ధృతి కొనసాగుతూనే ఉంది. దేశంలో కరోనా కేసుల సంఖ్య 9లక్షలు దాటింది. గడచిన 24 గంటల్లో 28,498 పాజిటివ్ కేసులు నమోదు కాగా, 553 మంది మరణించారు. దీంతో దేశవ్యాప్తంగా కరోనా బాధితుల సంఖ్య 9,06,752కు పెరిగింది. ప్రస్తుతం 3,11,565 మంది ఆస్పత్రుల్లో చికిత్స పొందుతున్నారు. ఇప్పటి వరకూ 5,71,460 మంది కోలుకున్నారు. ముఖ్యంగా మహానగరాల్లో దీని తీవ్రత ఎక్కువగా ఉంది. మహారాష్ట్ర, రాజస్థాన్, తమిళనాడు తర్వాత తెలుగు రాష్ట్రాల్లో కూడా కరోనా విళయం సృష్టిస్తుందనే చెప్పొచ్చు.
మార్చి, ఏప్రిల్ నెలలో వందల్లో ఉంటే.. ఇప్పుడు వేలల్లో కేసులు నమోదు అవుతున్నాయి. తాజాగా కర్ణాటకలో వైరస్ ఉద్ధృతి ఒక్కసారిగా పెరిగింది. నిన్న ఒక్కరోజే రాష్ట్రంలో 2738పాజిటివ్ కేసులు బయటపడ్డాయి. దీంతో అప్రమత్తమైన కర్ణాటక ప్రభుత్వం రాజధాని బెంగుళూరుతోపాటు పలు జిల్లాల్లో వారంపాటు పూర్తి లాక్డౌన్ ప్రకటించింది. నేటి సాయంత్రం(జులై 14) నుంచి జులై 22వరకు సంపూర్ణ లాక్డౌన్ కొనసాగుతుందని వెల్లడించింది. అయితే అత్యవసర సేవలు, కిరాణ దుకాణాలతోపాటు మరికొన్నింటికి లాక్డౌన్ నుంచి మినహాయించారు.
వివిధ రాష్ట్రాల నుంచి వచ్చే బస్సు సర్వీసులు కూడా నిలిపి వేస్తున్నట్లుగా సమాచారం. మంగళవారం నాటికి రాష్ట్రంలో 41,581 కేసులు నమోదుకాగా 757 మంది మృత్యువాతపడ్డారు. మొత్తం కేసుల్లో దాదాపు 25వేల మంది ప్రస్తుతం చికిత్స పొందుతున్నారు. క్రియాశీల కేసుల సంఖ్య ఎక్కువగా ఉండడంతో వైద్యసేవలపై ఒత్తిడి పెరిగినట్లు రాష్ట్ర మంత్రులు అభిప్రాయపడుతున్నారు. గతంలో కర్ణాటకలో కేసుల సంఖ్య భారీగానే ఉన్న కొద్ది రోజులుగా తగ్గుముఖం పట్టిందన్నారు.. కానీ లాక్ డౌన్ సడలించిన తర్వాత మళ్లీ కేసులు పెరిగిపోవడం మొదలయ్యాయి. ఈ నేపథ్యంలో కరోనాని కట్టడి చేయడానికి పూర్తిగా కట్టుదిట్టమైన చర్యలు తీసుకుంటున్నట్టు అధికారుల తెలిపారు.