ఇంటర్నెట్లో అధికంగా దేని కోసం వెతుకుంటారు? మసాల విషయాలు, సినిమాలు, రాజకీయాలకు సంబంధించిన విషయాలపైనే ఫోకస్ పెడుతుంటారు నెటిజన్లు. కానీ కొద్దిరోజులుగా ఆ ట్రెండ్ మారుతోందట. కరోనా వల్ల ఎంత ప్రమాదం ఉందో అందరికి అర్థమైంది. వైరస్ సోకిన తర్వాత ఆందోళన చెందే కంటే ముందునుంచే జాగ్రత్తగా ఉండటం మంచిదని భావిస్తున్నారు. కోవిడ్ తమ దాపుల్లోకి రాకముందే.. రోగనిరోధక శక్తిని పెంచుకోవడానికి చేయాల్సిన కసరత్తు అంతా చేస్తున్నారు. బహిరంగ మార్కెట్లో ఇమ్యూనిటీ పెంచే ఆహార ఉత్పత్తుల విక్రయాలు 40% పెరిగినట్లు గూగుల్ నివేదికే చెప్తోంది.
ఇప్పుడు ప్రతి ఒక్కరికీ ఆరోగ్య సంరక్షణపై భయం పట్టుకొంది. ఇంటర్నెట్లో బలవర్ధకమైన ఆహార పదార్థాల గురించి అన్వేషించేవారి సంఖ్య ఆరు రెట్లు పెరిగింది. గూగుల్ ఇండియా రిపోర్టు ప్రకారం, అంతర్జాలంలో ఎక్కువగా శోధించిన అంశాలు, వాటి పెరుగుదల శాతం చూస్తే నిజంగానే మనోళ్ల జాగ్రత్త గురించి తెలుస్తుంది. రోగనిరోధక శక్తి పెంపు ఎలా అనే అంశంపై భారీగా శోధించారు. ఏకంగా 500% వృద్ధి ఇందులో నమోదైంది. విటమిన్ సీ ఉండే ఆహారం గురించిన అన్వేషణలో 150% , ఔషధ గుణాలున్న మొక్కలు అంశంలో 380% వృద్ధి, వంటింటి వైద్యం అంశంలో 90% వృద్ధి నమోదు అయింది.
కాగా, ఇలా ఇంటర్నెట్లో వెతికిన అంశాలను అదే విధంగా అమల్లో కూడా పెడుతున్నారు. కొవిడ్ను జయించేందుకు రోగ నిరోధకశక్తి పెంచుకోవడమే మార్గమని అన్నివర్గాలు నమ్ముతున్నాయి. దీంతో ప్రొటీన్లు అధికంగా ఉన్న పదార్థాలను ఎక్కువగా వాడుతున్నారు. మటన్, చికెన్తో పాటు పప్పు దినుసులు ఎక్కువగా వినియోగిస్తున్నారు. ధర ఎంత ఉన్నప్పటికీ డ్ ఫ్రూట్లను కొంటున్నారు. వేడి నీరు, గ్రీన్ టీ కషాయం, చాయ్ వంటివి తరుచూ తాగితే మంచిదని చెప్తుండటంతో అల్లం, వెల్లుల్లి, ఇలాచి, లవంగం, పసుపు, శొంఠి వంటి పదార్థాలకు మార్కెట్లో డిమాండ్ పెరిగిపోతోంది.