ప్రపంచమంతా సంక్షోభం నెలకొంది. ఆర్థిక వ్యవస్థలపై సర్వత్రా ఆందోళనలు వ్యక్తమవుతున్నాయి. ఈ పరిణామాలన్నింటి నేపథ్యంలో ప్రపంచవ్యాప్తంగా స్టాక్ మార్కెట్లు, ఇతర పెట్టుబడి సాధనాలు ఓ కుదుపునకు లోనయ్యాయి. దీని నుంచి ఒక్క బంగారానికి మాత్రం మినహాయింపు ఇవ్వాల్సిందే. ఎందుకంటే ప్రపంచమంతా అనిశ్చితి ఉన్నా బంగారం మాత్రం భారీగా పుంజుకుంటోంది.
బహుశా ఇందుకేనేమో.. సంక్షోభమంటే పసిడికి చాలా ఇష్టమనే నానుడి కూడా వాడుకలో ఉంది.

 

గత చరిత్రను పరిశీలిస్తే సంక్షోభానికి, పసిడికి ఎలాంటి బంధం ఉందో స్పష్టంగా అర్థమవుతుంది. 2008లోనూ ప్రపంచం ఆర్థిక సంక్షోభంలో చిక్కుకుంది. అప్పుడు ఏ పెట్టుబడి సాధనాలు ఇవ్వనంతగా పసిడి భారీగా రిటర్నులు ఇచ్చింది. ఇప్పుడు అంతకంటే పెద్ద సంక్షోభం ఎదుర్కొంటోంది ప్రపంచం. మళ్లీ ఇప్పుడు కూడా పసిడి భారీ లాభాలు ఇస్తోంది.కరోనా సంక్షోభం ప్రారంభమై నాలుగు నెలలు కావొస్తోంది. ఈ నాలుగు నెలల కాలంలో బంగారం ధరలు 17 శాతం పెరిగాయి. దీన్ని బట్టి అర్థం చేసుకోవచ్చు సంక్షోభంలో పసిడి పరుగు ఎలా ఉంటుందో.

 

పసిడి ధరల పెరుగుదలకు సంక్షోభం ఒక్కటే కారణం కాదంటున్నారు నిపుణులు. కరెన్సీ బలహీన పడటం కూడా ఇటీవల పసిడి రికార్డు స్థాయిలను తాకేందుకు కారణంగా చెబుతున్నారు ఐఐఎం(అహ్మదాబాద్) గోల్డ్ పాలసీ సెంటర్ అధిపతి సుధీశ్ నంబియత్.అంతర్జాతీయ మార్కెట్లు పుంజుకోవటం, డాలర్ విలువ తగ్గటం వంటి పరిణామాలు ఉన్నా పసిడి ధరలు భారీగా పెరగటం వల్ల స్టాక్ మార్కెట్లు, కరెన్సీ, బంగారం మధ్య ఉండే పరస్పర సంబంధం దెబ్బతిన్నట్లు ఆయన విశ్లేషిస్తున్నారు.

 

 

గత ఏడాది జూన్​తో పోలిస్తే ఇప్పటి వరకు బంగారం 24 శాతం, ఏడాది మొత్తం మీద చూస్తే 40 శాతం పెరిగినట్లు గణాంకాలు చెబుతున్నాయి. మల్టీ కమొడిటీ ఎక్స్చేంజ్​ (ఎంసీఎక్స్)లో 10 గ్రాముల బంగారం ధర జులై 1న రికార్డ్ స్థాయిలో రూ.48,589కి చేరింది. ఈ స్థాయికి ధర పెరిగిన నేపథ్యంలో చాలా మంది లాభాల స్వీకరణకు కుడా దిగారు.అంతర్జాతీయంగా చూస్తే గత వారం ఔన్సు బంగారం ధర రూర.1,788.96 డాలర్లను తాకింది. 2012 అక్టోబర్ తర్వాత ఈ స్థాయిలో ధర పెరగటం మళ్లీ ఇదే ప్రథమం.

మరింత సమాచారం తెలుసుకోండి: