కాంగ్రెస్... గ్రాండ్ ఓల్డ్ పార్టీ. ఆ పార్టీని ఎంతో మంది ముందుకు తీసుకెళ్ళారు. మరెంతో మంది ఆ పార్టీతో ప్రముఖులు అయ్యారు. ఇంకెందరో కాంగ్రెస్ పార్టీ పేరును కాదనుకుని బయటకు వచ్చారు. అందులో కొందరు కాంగ్రెస్ ఉనికినే లేకుండా చేశారు. అలా కాంగ్రెస్ కి మిత్రులు, శత్రువులు తనలోనే ఉన్నారు. ఒక విధంగా చెప్పాలంటే కాంగ్రెస్ ఒక మహా సముద్రమే. దానిలో పడి ఈది బయటకు వచ్చినవాడు గజ ఈతగాడే.
అలా ఏపీలో ఒక జగన్ కనిపిస్తారు. కాంగ్రెస్ బానిస సంకెళ్ళు తెంచుకుని సొంత వ్యక్తిత్వం రుజువు చేసుకుని జగన్ ఈ రోజుకి ఈ రేంజికి ఎదిగారు. దానికి ఆయనకు పదేళ్ల సమయం పట్టింది. జగన్ జనంలో మమేకం అయిన విధానం కూడా గ్రేట్. ఆయన జన నాయకుడిగా దేశంలోనే చాలా అగ్రభాగాన ఉన్నారు.
కాంగ్రెస్ దుకాణం పేరు చెప్పుకుని ప్రముఖులుగా చలామణీ అయినా వారు ఎవరూ ఇపుడు ఏపీలో సీన్ లో కూడా లేరు. అసలు కాంగ్రెస్ పార్టీయే లేదు. దటీజ్ జగన్ అన్నంతగా ఎదిగారు. మరి ఇపుడు మరో యువ నేత సచిన్ పైలెట్ కాంగ్రెస్ మీద తిరుగుబాటు చేశారు. అయితే ఆయన వ్యూహం తప్పో లెక్క తప్పో తెలియదు కానీ దూకుడు ప్రదర్శించే లోపే కాంగ్రెస్ మేలుకుని చకచకా వేటు వేసి తమ సర్కార్ని ప్రస్తుతానికి కాపాడుకుంది.
సచిన్ పదవులు ఊడగొట్టి విమానం లేని వట్టి పైలెట్ చేసేసింది. ఇపుడు సచిన్ వద్ద ఉన్న 15 మంది ఎమ్మెల్యేలను కూడా తన వైపు తిప్పుకోవడానికి కాంగ్రెస్ ట్రై చేస్తుదనడంలో సందేహం లేదు. అపుడు సచిన్ కచ్చితంగా ఒంటరి వారు అవుతారు. మరి ఆయన ఏం చేస్తారు అన్నదే ఇపుడు ప్రశ్న.
జగన్ మాదిరిగా ఆయన కూడా తన జనాదరణను ప్రూవ్ చేసుకుంటే పది కాలాల పాటు రాజకీయాల్లో ఉంటారు. లేకపోతే మాత్రం ఆయన బీజేపీలో చేరడమో లేక మళ్ళీ కాంగ్రెస్ పంచకు రావడమో చేస్తే ఆయన పైలెట్ హోదా కూడా కోల్పోతారు. మరి సచిన్ జగన్ అవుతారా. కొత్త పార్టీ స్టార్ట్ చేస్తారా.. చూడాలి.