మోడీ అంటే రాజకీయ బాహుబలి, అజేయుడు అంటారు. ఆయన కేస్ డీల్ చేస్తే సక్సెస్ అని చెబుతారు. మోడీ కన్ను పడితే టోటల్ గా పాజిటివ్ రిజల్ట్ రావాల్సిందే. అవతల వారు ఎవరైనా ఫినిష్. ఇది కదా మోడీ గురించిన బిల్డప్. కానీ ఇపుడు మెల్లగా సీన్ మారుతోంది. మోడీ ఖాతాలో కూడా ఎన్నో ఫెయిల్యూర్స్ వరసగా వచ్చి పడుతున్నాయి.
మోడీ రాజకీయ బాణాలు కూడా అలాగే వెనక్కు వస్తున్నాయి. కర్నాటకను మింగేసినట్లుగా, మధ్యప్రదేశ్ కాంగ్రెస్ ని వధ్య శిల మీద పెట్టేసి కమలవికాసం చేసినట్లుగా రాజస్థాన్ లో రాజసం చేస్తామంటే కుదరదు అని తేగేసి చెప్పేశాయి అక్కడి పరిణామాలు. యువ నేత సచిన్ పైలెట్ సోనియకే షాక్ ఇచ్చాడనుకుంటే మోడీ ఎత్తుగడలకూ బిగ్ షాక్ ఇచ్చేశారు.
తన సొంత కుంపటి అంటున్నారు. తన సత్తా చాటుతాను అని ఆయన చెబుతున్నారు. ఏపీలో జగన్ మాదిరిగా తాను సొంతంగా పార్టీ పెట్టి అధికారంలోకి వస్తానని చెబుతున్నారు. నిజంగా ఇది మెచ్చవలసిన నిర్ణయమే. కాంగ్రెస్ నుంచి బీజేపీలోకి చేరిన జ్యోతిరాదిత్యకు నిన్న ఉన్న మర్యాద ఇవాళ ఉండదు, అదే ఆయన కూడా సొంత రాజకీయం చూపిస్తే పదికాలాలు హాయిగా ఉండేవారు.
ఆ పని ఇపుడు సచిన్ చేస్తున్నారు. రాజస్థాన్ లో బలమైన జాట్స్, కూర్మి వంటి కులాలను కూడగట్టే పనిలో ఆయన బిజీగా ఉన్నారు. తన కొత్త పార్టీతో అక్కడ సోషల్ ఇంజనీరింగ్ చేస్తే అక్కడ కాంగ్రెస్ తో పాటు బీజేపీ పునాదులు కూడా కదలడం ఖాయం. అక్కడ వసుంధరరాజే తప్ప కొత్త నాయకత్వం బీజేపీకి లేదు. ఇక అశోక్ గెహ్లాట్ వంటి వ్రుధ్ధ నేతతో కాంగ్రెస్ కధ నడుస్తోంది.
సచిన్ పైలెట్ కనుక రంగంలోకి దూకి సొంత పార్టీ పెడితే మరో ప్రాంతీయ పార్టీ చేతుల్లోకి రాజస్థాన్ రాజకీయం వెళ్ళిపోవడం ఖాయం. ఏది ఏమైనా కూడా మోడీ అమిత్ షా స్కెచ్ వేసి కూడా రాజస్థాన్ రాజకీయాన్ని ఒడిసిపట్టలేకపోయారంటే అది బిగ్ ఫెయిల్యూర్ కిందకే వస్తుందని అంటున్నారు.