జూన్ 15న గాల్వన్ లోయలో భారత్, చైనా మధ్య జరిగిన భారీ ఘర్షణలో తెలంగాణకు చెందిన కర్నల్ సంతోష్ బాబుతో సహా 20 మంది భారత జవాన్లు అమరులలైన సంగతి తెలిసిందే. ఈ నేపథ్యంలో ఇరు దేశాల మధ్య తీవ్ర స్థాయికి చేరిన ఉద్రక్తతలు ప‌లు మ‌లుపులు తిరుగుతున్నాయి. తాజాగా ఇరు దేశాల ఉన్నత సైనికాధికారుల మధ్య సుమారు 15 గంటలపాటు జరిగిన సుదీర్ఘ చర్చలు జ‌రిగాయి. అదే స‌మ‌యంలో, చైనాతో సరిహద్దు ఉద్రిక్తతల నేపథ్యంలో తేలికపాటి ట్యాంకుల అత్యవసర సేకరణకు కేంద్ర ప్రభుత్వం బుధవారం ఆమోదం తెలిపింది. ఈ ట్యాంకులను అధిక ఎత్తులో ఉన్న ప్రాంతాల్లో మోహరించే అవకాశం ఉంది.

 


స‌రిహ‌ద్దు వ‌ద్ద ఇరు దేశాల మధ్య తీవ్ర స్థాయికి చేరిన ఉద్రక్తతలను తగ్గించుకునేందుకు భారత్, చైనాకు చెందిన ఆర్మీ అధికారుల మధ్య పలు దఫాలుగా చర్చలు జరుగుతున్నాయి. ఇందులో భాగంగా భారత వైపు వాస్తవాధీన రేఖ సమీపంలోని చు‌షుల్ సమావేశం పాయింట్ వద్ద మంగళవారం ఉదయం 11 గంటల నుంచి బుధవారం తెల్లవారుజాము 2 గంటల వరకు లెఫ్టినెంట్ జనరల్ స్థాయిలో సుమారు 15 గంటలపాటు నాలుగో విడత చర్చలు జరిగాయి.  తూర్పు లఢక్ సరిహద్దులో యథాతథ స్థితిని పునరుద్ధరించాల్సిందేనని చైనాకు భారత్ స్పష్టం చేసింది. వాస్తవాధీన రేఖ వెంట మే5కు ముందు ఉన్న శాంతి, ప్రశాంత వాతావరణం తిరిగి నెలకొనేందుకు సరిహద్దు నిర్వహణ కోసం పరస్పరం అంగీకరించిన అన్ని ప్రోటోకాల్స్‌ను చైనా తప్పక పాటించాలని పేర్కొంది. సరిహద్దులో చైనీస్ పీపుల్స్ ఆర్మీ ఏర్పాటు చేసిన సైనిక శిబిరాలపై ఈ సందర్భంగా భారత ప్రతినిధి బృందం అభ్యంతరం తెలిపింది. సరిహద్దు ప్రాంతంలోని మొత్తం పరిస్థితిని మెరుగుపరిచే బాధ్యత చైనాపైనే ఎక్కువగా ఉన్నదని పేర్కొంది. పాంగోంగ్ త్సో, డెప్సాంగ్ వంటి అన్ని ఘర్షణ పాయింట్ల నుండి "సమయ పరిమితి, ధృవీకరించదగిన విధంగా" ఎల్ఏసీ వెంబడి ఉన్న స్థావరాల నుంచి బలగాలు, ఆయుధాల ఉపసంహరణకు ఒక కార్యాచరణను సిద్ధం చేయాలని ఈ చర్చల్లో ఇరు దేశాలు నిర్ణయించాయి. భారత ప్రతినిధి బృందానికి లేహ్‌లోని 14 కార్ప్స్ కమాండర్ లెఫ్టినెంట్ జనరల్ హరీందర్ సింగ్ నాయకత్వం వహించగా, సౌత్ జిన్జియాంగ్ సైనిక ప్రాంత కమాండర్ మేజర్ జనరల్ లియు లిన్ చైనా తరుఫున నాయకత్వం వహించారు.

 

కాగా, ఏప్రిల్ నెలాఖరులో తూర్పు లడఖ్‌లోని ఎల్‌ఏసీ వెంట కొత్త టైప్-15 తేలికపాటి ట్యాంకులను చైనా మోహరించడం భారత్ కు తీవ్ర ఆందోళన కలిగిస్తుంది. ఈ క్రమంలో సైన్యం అమ్ములపొదిలో అలాంటి రకం యుద్ధ ట్యాంకులను వీలైనంత త్వరగా చేర్చేందుకు భారత్ సిద్దమైంది. లడఖ్‌ ప్రాంతంలో తేలికపాటి యుద్ధ ట్యాంకులు వచ్చినపక్షంలో అవి భారత సైన్యానికి పెద్ద ఊపునిస్తాయి. అవి ప్రధాన యుద్ధ ట్యాంకులతో పోలిస్తే మరింత చురుకైనవి. భవిష్యత్తులో చైనా మనపై దాడి చేసేందుకు యత్నించిన పక్షంలో అడ్డుకోవడానికి ఎల్ఏసీ వెంట ముందుకు వెళ్లే ప్రదేశాల్లో మోహరించేందుకు వాయురవాణా చేయగలిగిన ట్యాంకులు అవసరమవుతాయని భారత సైన్యం కోరుకుంటున్నది. ఇలా ఏక‌కాలంలో శాంతి మంత్రం, తేడా వ‌స్తే, చుక్క‌లు చూపే యుద్ధ తంత్రం సిద్ధం చేస్తోంది. 

మరింత సమాచారం తెలుసుకోండి: