ఇండియాలో కరోనా ఉద్ధృతి కొనసాగుతూనే ఉంది. రికార్డు స్థాయిలో పాజిటివ్ కేసులు నమోదు కావటం కలవర పెడుతోంది. మృతుల సంఖ్య కూడా ఆందోళనకరంగానే ఉంది. ముఖ్యంగా ఆరు రాష్ట్రాల్లో కరోనా పాజిటివ్ కేసుల సంఖ్య అంతకంతకూ పెరుగుతూనే ఉన్నాయి.
భారత్లో కరోనా వైరస్ మహమ్మారి ఊహించని రీతిలో విజృంభిస్తోంది. గత కొన్నిరోజులుగా నిత్యం రికార్డు స్థాయిలో పాజిటివ్ కేసులు నమోదవుతున్నాయి. బుధవారం ఒక్కరోజే దేశవ్యాప్తంగా 32,695 పాజిటివ్ కేసులు బయటపడ్డాయి. ఒకేరోజు ఈ స్థాయిలో కేసులు నమోదుకావడం ఇదే తొలిసారి. గడిచిన 24 గంటల్లో 606 కొవిడ్ రోగులు మృత్యువాతపడ్డారు.
గురువారం నాటికి దేశంలో మొత్తం కరోనా రోగుల సంఖ్య 9,68,876కు చేరింది. వీరిలో ఇప్పటి వరకు 24,915 మంది ప్రాణాలు కోల్పోయినట్లు కేంద్ర ఆరోగ్యశాఖ వెల్లడించింది. ప్రస్తుతం మొత్తం కరోనా బాధితుల్లో 6,12,815 మంది కోలుకున్నారు. మరో 3,31,146 యాక్టివ్ కేసులు ఉన్నట్లు ప్రభుత్వం తెలిపింది. ప్రస్తుతం దేశంలో కరోనా రోగుల రికవరీ రేటు 63 శాతంగా ఉంది.
దేశవ్యాప్తంగా కరోనా పాజిటివ్ కేసుల సంఖ్యతోపాటు మరణాల సంఖ్య కూడా పెరగడం కలవరపెడుతోంది. గత జూన్ మాసంలో దేశవ్యాప్తంగా దాదాపు 4 లక్షల కేసులు బయటపడ్డాయి. జులైలో 15 రోజుల్లోనే 3,83,000 పాజిటివ్ కేసులు నిర్ధారణ అయ్యాయి. ఈ పదిహేను రోజుల్లోనే 7515 మంది కొవిడ్ సోకి మృత్యువాతపడ్డారు.
దేశవ్యాప్తంగా ఆరు రాష్ట్రాల్లో కరోనా మరణాల తీవ్రత ఎక్కువగా ఉంది. ఇప్పటికే ఇక్కడ వెయ్యికిపైగా కొవిడ్ మరణాలు రికార్డయ్యాయి. అత్యధికంగా మహారాష్ట్రలోనే 2,75,640 పాజిటివ్ కేసులు నమోదుకాగా 10,928 మంది ప్రాణాలు కోల్పోయారు. ఢిల్లీలో 3487 మంది కరోనా రోగులు ప్రాణాలు కోల్పోయారు. తమిళనాడులో 2167, గుజరాత్లో 2079, ఉత్తర్ప్రదేశ్ 1012, పశ్చిమ బెంగాల్లో 1000 మంది మృత్యువాతపడ్డారు. మొత్తానికి కరోనా వైరస్ మన దేశంపై పగబట్టినట్టే ఉంది.