మాజీ డిప్యూటీ సీఎం రాజయ్యపై ఒత్తిడి పెరుగుతోంది. దాంతో ఆయన మంగళవారం నియోజకవర్గ నేతలతో భేటీ కానున్నారు. ఈ రోజు ఉదయం 11 గంటలకు రాజయ్య ప్రెస్మీట్ ఏర్పాటు చేయనున్నారు. ఈ సందర్భంగా ఆయన రాజకీయంగా కీలక నిర్ణయాన్ని ప్రకటించనున్నట్లు సమాచారం. కాగా ముఖ్యమంత్రి కేసీఆర్తో రాజయ్య సోమవారం సాయంత్రం భేటీ అయ్యారు.

డిప్యూటీ సీఎం పదవి నుంచి ఉద్వాసనకు గురయ్యాక రాజయ్య సీఎంను కలవడం ఇదే మొదటిసారి. సుమారు ఇరవై నిమిషాల పాటు రాజయ్య సీఎం వద్ద ఉన్నారు. తొందరపడొద్దని, మంచి రోజులు ఉన్నాయని, కొంత ప్రవర్తన మార్చుకోవాలని రాజయ్యకు సీఎం సూచించారని, సుతిమెత్తగా మందలించారని సమాచారం.

కాగా తనకు తెలిసి ఎలాంటి తప్పు చేయలేదని, కొందరు అధికారులు తనను మభ్యపెట్టారని రాజయ్య జవాబిచ్చుకునే ప్రయత్నం చేశారని తెలిసింది. అయిదారు నెలల పాటు ఓపిక పడితే, మరో పదవి ఇస్తామని భరోసా కూడా లభించిందని చెబుతున్నారు. సమావేశం అనంతరం రాజయ్య మాట్లాడుతూ కేసీఆర్ నాయకత్వంలోనే పని చేస్తానన్నారు. మంగళవారం జరిగే పార్టీ సమావేశానికి ఆహ్వానించారని తెలిపారు. ఈ నేపథ్యంలో రాజయ్య ప్రెస్ మీట్ ప్రాధాన్యత సంతరించుకుంది.

.

మరింత సమాచారం తెలుసుకోండి: