‘జీవితమే మారిపోతుంది’ అనే సమాధానాన్నే చెబుతారెవరైనా. మరి నిజంగా మారిపోతుందా? ప్రాక్టికల్‌గా అది సాధ్యం అవుతుందా.. అంటే మాత్రం ఆలోచించాల్సిందే. ఇలాంటి ఆలోచననే జనింపజేస్తోంది సుశీల్‌కుమార్ జీవితం. సుశీల్‌కుమార్‌ను కొత్తగా పరిచయం చేయాల్సిన అవసరం లేదు. 2011లో దేశవ్యాప్తంగా సుశీల్ పేరు మార్మోగింది. అమితాబ్ బచ్చన్ హోస్ట్‌గా వ్యవహరించే సోనీటీవీ వారి కౌన్ బనేగా కరోడ్‌పతి కార్యక్రమంలో ఐదు కోట్ల రూపాయల ప్రైజ్‌మనీని గెలుచుకొన్న విజే తగా ఈ బిహారీ అందరికీ పరిచయం అయ్యాడు. కేబీసీ చరిత్రలోనే తొలిసారి అంత పెద్ద మొత్తాన్ని గెలుచుకొన్న వ్యక్తి కూడా కావడంతో ఇతడికి అప్పట్లో బీభత్సమైన క్రేజ్ కనిపించింది. ఉత్తర బీహార్‌లోని మోతిహరి ప్రాంతానికి చెందిన ఒక సాధారణ కుటుంబానికి చెందిన వ్యక్తి సుశీల్. అక్కడ కంప్యూటర్ ఆపరేటర్‌గా పనిచేస్తున్నానని... నెలకు ఆరువేల రూపాయల జీతం వస్తుందని.. కేబీసీ సీజన్ ఫైవ్‌లో సుశీల్ తన నేపథ్యం గురించి చెప్పుకున్నాడు. ఆ షోలో సుశీల్ ఐదు కోట్ల రూపాయలు గెలుచుకొని ఇప్పటికి నాలుగేళ్లు పూర్తయ్యాయి. ఈ నేపథ్యంలో ఇప్పుడు అతడి పరిస్థితి ఏమిటి అనే విషయం గురించి పరిశీలిస్తే... ఇప్పుడు సుశీల్‌కు ఆ ఉద్యోగం కూడా లేదు! అతను ఒక నిరుద్యోగి. అంతే.

డబ్బు వచ్చిందనే ఆనందంలో ఉద్యోగం మానేశాడు సుశీల్. బీఎడ్ పూర్తి చేసినా ప్రభుత్వ ఉద్యోగం రాలేదు, సివిల్స్ ప్రయత్నాలు విఫలం అయ్యాయి. ఇప్పుడు బ్యాంక్‌లో ఉన్న మొత్తంపై వచ్చే వడ్డీ డబ్బు, ఇంటి దగ్గర ఉన్న నాలుగు ఆవులు సుశీల్ కుటుంబానికి జీవనాధారం. సోదరులు సుశీల్ ఇచ్చిన డబ్బుతో వ్యాపారం చేస్తున్నా అది వారి కుటుంబాల పోషణకే సరిపోతోంది. దీంతో తన భార్య ఇప్పుడు తీవ్రమైన అసంతృప్తితో ఉందని సుశీల్ చెబుతున్నాడు. అంత డబ్బు వచ్చినా మన జీవితాలేమీ మారలేదు కదా.. అని అమె సుశీల్ దగ్గర అంటూ ఉంటుందట.

సుశీల్ నేటికీ తన సొంతూళ్లోనే ఉంటున్నాడు. ఉమ్మడి కుటుంబంతోనే గడుపుతున్నాడు. ఇదంతా సింప్లిసిటీ అనుకోవద్దు. ఇంతకన్నా గొప్పగా బతకడానికి తన ఆర్థిక స్థితి సరిపోలేదని సుశీల్ చెబుతాడు! ఐదు కోట్ల రూపాయల ప్రైజ్‌మనీలో పన్నులు పోనూ మూడు కోట్ల అరవై లక్షలు చేతికి వచ్చాయట. ఆ డబ్బుతో సొంతూళ్లో ఒక ఇల్లు కట్టడం, నలుగురు సోదరులు సెటిలవ్వడానికి కొంత కేటాయించడం, స్థానికంగా కొంత భూమిని కొని, మిగిలిన కొంచెం డబ్బును తల్లి పేరుతో బ్యాంక్ అకౌంట్‌లో జమ చేయడంతోనే సుశీల్ బ్యాలెన్స్‌షీట్ జీరోను చూపించిందట! ఇక ప్రత్యేకంగా తను సెటిలవడానికి, విలాసంగా గడపడానికీ డబ్బులేమీ లేకుండాపోయాయట. వినడానికి కొంత విడ్డూరంగా, ఆశ్చర్యంగా ఉన్నా సుశీల్ ప్రస్తుత సాదాసీదా జీవన శైలి ఇదే వాస్తవమని చెబుతోంది.

నాలుగేళ్ల కిందట సుశీల్ ఒక సెలబ్రిటీ. మీడియా ఇతడి మేధోతనాన్ని మెచ్చుకొంది. సమాజం ఇతడిని ఆరాధించింది. అప్పటి బి హార్ ముఖ్యమంత్రి నితీశ్‌కుమార్ సుశీల్ ఇంటికి వెళ్లి మరీ రాజకీయాల్లోకి ఆహ్వానించాడు. అయితే ఇప్పుడు సుశీల్‌ను ప్రత్యేకమైన వ్యక్తిగా చూసేవారెవరూ లేరు. ఆ రోజులు ఎప్పుడో పోయాయి. మరి సుశీల్ వ్యవహారం ‘డబ్బు- జీవితం’తో ముడిపడిన సమీకరణాల గురించి ఏదో సందేశాన్నే ఇస్తోంది. కొంచెం ఆలోచిస్తే అది ఎవరికైనా అర్థం అవుతుంది!

మరింత సమాచారం తెలుసుకోండి: