పరిటాల శ్రీరామ్. ఇటీవల కాలంలో తరచుగా వార్తల్లో నిలిచిన హాట్ టాపిక్ ఇదే. అనంతపురం జిల్లా రాప్తాడు నియోజక వర్గం నుంచి బరిలో నిలిచిన పరిటాల రవి వారసుడిగానే కాకుండా టీడీపీ యువ నేతగా కూడా ఆయన రికార్డు సృష్టించా రు. పరిటాల ఫ్యామిలీ అంటేనే పెనుగొండ, రాప్తాడు వంటి కీలక నియోజకవర్గాల్లో సత్తాచాటిన కుటుంబంగా గుర్తింపు సాధించింది. గత ఎన్నికల్లోనే రవి వారసుడిగా రంగంలోకి దిగాలని శ్రీరామ్ భావించినా.. కొన్ని కారణాలతో వెనక్కి తగ్గాల్సి వచ్చింది. ఈ క్రమంలోనే ఇప్పుడు మంత్రి పరిటాల సునీత రెండు సీట్లు కావాలని చంద్రబాబు వద్ద పట్టుబట్టినా.. కేవలం ఒక సీటుకే పరిమితం అయ్యారు. సునీత తాను రాప్తాడు నుంచి పోటీ చేసి శ్రీరామ్కు పెనుగొండ లేదా కళ్యాణదుర్గం అసెంబ్లీ సీటు ఇప్పించుకోవాలని విశ్వప్రయత్నాలు చేసి ఫెయిల్ అయ్యారు.
అసెంబ్లీ సీటు సాధ్యం కాకపోవడంతో హిందూపురం నుంచి ఎంపీగా అయినా పోటీ చేస్తే ఎలా ఉంటుందన్న ఆలోచన కూడా పరిటాల వర్గానికి వచ్చింది. అవేవి సాధ్యపడలేదు. ఇదే టైంలో జిల్లాలో తమకు చిరకాల రాజకీయ ప్రత్యర్థులుగా ఉన్న జేసీ సోదరులు ఇద్దరూ తమ వారసుల కోసం తమ సీట్లు త్యాగం చేశారు. ఈ ఎన్నికల్లో గెలిస్తే జేసీ వారసులు రాజకీయంగా ముందు ఉంటారని.. తన వారసుడు వెనకపడిపోతాడన్న ఆందోళనతో మంత్రి సునీత తన సీటును త్యాగం చేసి తన కుమారుడికి అవకాశం కల్పించారు. రాప్తాడు నియోజకవర్గంలో గత రెండు ఎన్నికల్లోనూ సునీత విజయం సాధించారు. 2009లో 1700 మెజారిటీ, 2014లో ఏడు వేల ఓట్ల మెజారిటీతో ఆమె విజయం సాధించారు. ఇక, ఆ రెండు ఎన్నికల్లోనూ సునీతపై పోటీ చేసిన తోపుదుర్తి ప్రకాశ్ రెడ్డి ఓటమి పాలయ్యారు.
గత రెండు ఎన్నికల్లో ప్రకాశ్ ఓడినా నియోజకవర్గంలో అనుబంధం పెంచుకున్నారు. ప్రజల్లో కలిసి పోయారు. సమస్యలపై స్పందించారు నేనున్నానంటూ.. పరిటాల ఫ్యామిలీకి ప్రత్యామ్నాయంగా మారారు. ఇక, ఇటీవల ముగిసిన ఎన్నికల్లోను తోపుదుర్తి వైసీపీ టికెట్పై విజయం సాధించారు. ప్రతి ఒక్కరినీ కలుపుకొని పోవడంలో ఆయన సక్సెస్ అయ్యారు. వరుసగా మూడోసారి ప్రకాశ్ పరిటాల ఫ్యామిలీపై పోటీలో ఉండడంతో ఆయనపై సానుభూతి ఉంది. అలాగే నియోజకవర్గంలో పరిటాల ఫ్యామిలీకి వన్సైడ్గా ఉండే బీసీ ఓటర్లలో ఈ సారి మార్పు కనపడుతోంది. ఇక పరిటాల శ్రీరామ్ కూడా యువతను తనవైపు తిప్పుకొన్నారు. ఎన్నికలకు ముందుగా నే తన కుమారుడి అభ్యర్థిత్వంపై నమ్మకంగా ఉన్న సునీత కూడా ఇంటింటికీ తిరుగుతూ.. తన కుమారు డిని గెలిపించాలని, రవికి గిఫ్ట్గా ఇవ్వాలని ప్రజలను అభ్యర్థించారు. ఈ మొత్తం పరిణామంలో ఇరు వర్గాలు కూడా హోరా హోరీ పోరును తలపించాయి.
గెలుపు కోసం ఇరు వర్గాలు గట్టిగానే ప్రయత్నించారు. దీంతో ఎన్నికలకు ముందు శ్రీరామ్ గెలుపు ఏకపక్షమేనని, భారీ మెజారిటీ ఖాయమని భావించిన టీడీపీ వర్గాల్లో ఎన్నికల సమయం వచ్చే సరికి మాత్రం ఆశలు గల్లంతయ్యాయనే చెప్పాలి. దీంతో శ్రీరామ్ మెజారిటీపై ముందున్న ఆశలు లేకుండా పోయాయి. గెలిస్తేనే గొప్ప అని ఇప్పుడు టీడీపీ సరిపెట్టుకుంటోంది. అటు గెలుపుపై ప్రకాశ్ వర్గం ధీమాతో ఉంది. మరి ఫలితం ఎలా ఉంటుందో చూడాలి.