పశ్చిమ బెంగాల్ సీపీఎం నేత, రాయ్గంజ్ లోక్సభ అభ్యర్థి మహ్మద్ సలీమ్ కారుపై దుండగులు దాడి చేశారు. పశ్చిమ బెంగాల్ ఇస్లామాపూర్ వద్ద ఈ సంఘటన చోటు చేసుకుంది. ఈ రాళ్ల దాడి వెనుక టీఎంసీ హస్తం ఉందని సీపీఎం నేతలు ఆరోపిస్తున్నారు.
బీజేపీ ఎంపీ అభ్యర్థి కన్వర్ సింగ్ తన్వర్ అమోరాలో దొంగ ఓటింగ్ జరుగుతోందని ఆరోపించారు. బుర్కాలో ఉన్న వారిని పరీక్షించటం లేదని, మగవాళ్లు బుర్కాలో వచ్చి దొంగ ఓట్లు వేసినట్లు విన్నానన్నారు.
కర్ణాటక మాజీ ముఖ్యమంత్రి సిద్దారామయ్య మైసూర్లో తన ఓటు హక్కును వినియోగించుకున్నారు. తమిళనాడు ఉపముఖ్యమంత్రి పన్నీరు సెల్వం తన కుటుంబ సభ్యులతో కలిసి క్యూలైన్లో నిలబడి, ఓటు హక్కును వినియోగించుకున్నారు.
లోక్ సభ ఎన్నికల రెండో దశలో మొత్తం 11 రాష్ట్రాలు, ఒక కేంద్రపాలిత ప్రాంతంలో 95 లోక్ సభ స్థానాలకు ఎన్నికలు జరుగుతున్నాయి. ఆయా రాష్ట్రాల్లో ప్రముఖులు, సినీ సెలబ్రిటీలు ఉదయమే వచ్చి ఓటు హక్కు వినియోగించు కుంటున్నారు. ఓటు వేసేందుకు పోలింగ్ కేంద్రాలకు పెద్ద ఎత్తున ప్రజలు తరలివస్తున్నారు. ఐతే, అసోం లో ఈవీఎంలు మొరాయించడంతో అక్కడ పోలింగ్ ముందుకు సాగట్లేదు.
అసోం లోని నార్త్ కరీంగంజ్ లో అసలు పోలింగే మొదలవ్వలేదు. అక్కడి ఓ పోలింగ్ కేంద్రంలో ఈవీఎం లు సరిగా పనిచేయకపోవడంతో, పోలింగ్ని నిషేధించాలని ప్రజలు నిర్ణయించారు. ఉదయం 10.30 వరకూ అక్కడ ఒక్క ఓటు కూడా పడలేదు. ఓ మహిళ మాత్రం కళ్లు తిరిగి కింద పడింది.
బెంగాల్ లో తృణమూల్ కాంగ్రెస్ కార్యకర్తలు పల్లెల్లోని పోలింగ్ బూతుల్లోకి వెళ్లిపోతున్నారన్న ఆరోపణలు కలకలం రేపాయి. కార్యకర్తలు పోలింగ్ బూతుల్ని ఆక్రమించి, అక్రమాలకు పాల్పడుతున్నారని ఓటర్లు ఆందోళనలకు దిగుతున్నారు. అక్కడక్కడా ఉద్రిక్త పరిస్థితులు కనిపిస్తున్నాయి. ఉత్తర దినాజపూర్ జిల్లాలోని హతిగషాలో గ్రామస్థులు, తమ ఓటర్ ఐడీలను తృణమూల్ కార్యకర్తలు లాక్కున్నారని మండి పడుతున్నారు. దాదాపు 200 మంది ఓటర్లను కార్యకర్తలు తరిమికొట్టడంతో, హింస చెలరేగింది. దాంతో ఓటు వేసేది లేదని రెండు పోలింగ్ కేంద్రాల జనం తీర్మానించారు. అక్కడ కేంద్ర పారా మిలిటరీ దళాలు లేకపోవడం అసలు సమస్య అయ్యింది.
ప్రధానమంత్రి చాపర్ ను చెక్ చేసిన అధికారిని కేంద్ర ఎన్నికల సంఘం సస్పెండ్ చెయ్యడం రాజకీయంగా కలకలం రేపింది. ఈసీ చర్యను కాంగ్రెస్ తప్పుపట్టింది. ఆ అధికారి ఏం తప్పు చేశారని ఈసీ ఆయన్ను సస్పెండ్ చేసిందో చెప్పాలని అధికారికంగా డిమాండ్ చేసింది.