దేశవ్యాప్తంగా జరుగుతున్న సార్వత్రిక ఎన్నికల్లో ఏడు దశల్లో ఎన్నికలు జరుగుతుండగా, తెలుగు రాష్ట్రాల్లో తొలి దశలోనే ఎన్నికలు పూర్తయిన సంగతి తెలిసిందే. తెలంగాణలో పార్లమెంటు నియోజకవర్గాలకు , ఆంధ్రప్రదేశ్లో అసెంబ్లీ- పార్లమెంటు స్థానాలకు పోలింగ్ జరిగింది. ఈ ఎన్నికల పర్వంపై, ఎన్నికల అనంతరం ఏపీ ముఖ్యమంత్రి, తెలుగుదేశం పార్టీ అధ్యక్షుడు చంద్రబాబు నాయుడు స్పందిస్తున్న తీరుకు....అదే సమయంలో తెలంగాణలో ఎన్నికలు పూర్తయిన తర్వాత సీఎం పీఠంపై ఉన్న కే చంద్రశేఖర్ రావు స్పందించిన శైలి పలువురు ఆసక్తికరంగా విశ్లేషిస్తున్నారు.
ప్రధానంగా ఇద్దరూ సీఎం హోదాలో వ్యవహరించిన తీరును పలువురు ప్రస్తావిస్తున్నారు. తెలంగాణ సీఎం కేసీఆర్ ప్రభుత్వాన్ని రద్దు చేసి ముందస్తు ఎన్నికలకు వెళ్లిన తర్వాత వ్యవహరించిన విధానం, ఇప్పుడు చంద్రబాబు వ్యవహరిస్తున్న శైలిని కొందరు గుర్తుచేసుకుంటున్నారు. ఎన్నికలను ఎదుర్కుంటున్న తరుణంలో, పోలింగ్ పూర్తయి ఫలితాల కోసం ఎదురుచూస్తున్న సమయంలో తెలంగాణ సీఎం కేసీఆర్ ఏ అధికారితోనూ మాట్లాడలేదు. ప్రభుత్వ సంబంధమైన విషయాలలోనూ ఆయన జోక్యం చేసుకోలేదు. తిరిగి అధికారం చేపట్టిన తర్వాతే ఆయన పరిపాలన కార్యకలాపాల్లో భాగం పంచుకున్నారు.
ఇక ఏపీ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు దీనికి భిన్నంగా వ్యవహరించారని అంటున్నారు. పోలింగ్ తదుపరి ఆయన ఓ వైపు ప్రభుత్వ వ్యవస్థలో అపద్ధర్మ సీఎం కంటే భిన్నంగా అధికారం తన సొంతం అన్నట్లుగా వ్యవహరిస్తూ నిర్ణయాలు, సమీక్షలు తీసుకుంటున్నారని పలువురు అభ్యంతరం తెలుపుతున్నారు. ఓవైపు స్వతంత్ర వ్యవస్థ అయిన ఈసీపై విమర్శలు చేస్తూ...మరోవైపు అదే సమయంలో అధికారంలో అదే ఈసీ పరిమితులను ఉల్లంఘించేలా వ్యవహరించడం ఏపీ ముఖ్యమంత్రి నారా చంద్రబాబుకే చెల్లిందంటున్నారు.