ఏపీలో సాధారణ ఎన్నికలు ముగిశాయి. ఎవరికి వారు తామే అధికారంలోకి వస్తున్నామన్న అంచనాల్లో మునిగి తేలుతున్నారు. జనసేనకు అధికారంలోకి వస్తామన్న ధీమా లేకపోయినా.. తమ మద్దతుతోనే టీడీపీ లేదా వైసీపీ అధికారంలోకి వస్తాయే తప్పా ఆ రెండు పార్టీలకు సొంతంగా అధికారం దక్కించుకునే సీట్లు రావని నమ్ముతోంది. టీడీపీ మరో సారి అధికారంలోకి వస్తామని పైకి మేకపోతు గాంభీర్యాన్ని ప్రదర్శిస్తున్నా లోపల మాత్రం ఆ పార్టీ నేతలను ఎక్కడ తమ కొంప మునుగుతుందో అన్న ఆందోళన వెంటాడుతోంది. ఇటు జనసేన సైతం ఏపీలో టీడీపీ ఓడిపోతుందని బలంగా నమ్ముతోంది. అయితే టీడీపీ తమకు మద్దతు ఇవ్వడమో లేదా తమ మద్దతుతో అధికారం చేపట్టడమో చెయ్యాల్సి ఉంటుందని కూడా ధీమాతో ఉంది. రేపు ఎన్నికల్లో తాము గెలిచే సీట్లే కీలకం కానున్నాయన్నది జనసేన ప్రగాడ విశ్వాసం.
ఎలాగో ఏపీలో అధికారంలోకి వస్తామన్న నమ్మకం లేకపోవడమో ఏమోగాని సాధారణ ఎన్నికల ఫలితాల తర్వాత యూపీఏ కన్వినర్గా చంద్రబాబే అవుతారని... ఆయన అవసరమైతే ప్రధాని కూడా అవుతారని టీడీపీ నాయకులు ఇప్పటికే హడావుడి స్టాట్ చేసేశారు. ఈ క్రమంలో కొందరు సీనియర్లు ఇప్పటికే ఢిల్లీలో మఖాం వేసి ఆ దిశగా ప్రయత్నాలు చేస్తున్నారు. ఇందుకు టీడీపీ నాయకులు చెబుతున్న కాకమ్మ లెక్కలు కూడా చాలా చిత్రవిచిత్రంగానే ఉన్నాయి. ఎన్డీయే రేపు 200 నుంచి 210 సీట్లకు పరిమితం అయితే మిగిలిన 340 సీట్లు ఏ పార్టీ అయినా అధికారంలోకి వచ్చేందుకు కీలకం కానున్నాయి. ఆ ప్రాంతీయ పార్టీలకు చెందిన కీలక నేతలను సమన్వయం చేసే సమర్థత ఒక్క చంద్రబాబుకు మాత్రమే ఉందని టీడీపీ నమ్ముతోంది. ఒక్క వైసీపీ అధినేత జగన్ను మినహాయిస్తే టీఆర్ఎస్తో సహా దేశంలో ఉన్న మిగిలిన పార్టీలన్నిటిని ఏకతాటి మీదకు తీసుకువచ్చే ప్రయత్నాలు సైతం చంద్రబాబు అప్పుడే ప్రారంభించేశారిని ఢిల్లీలో హడావుడి చేస్తున్న టీడీపీ టీం చెబుతోంది.
టీడీపీ వాళ్ల కట్టుకథ చూస్తే పిచ్చ కామెడీగా ఉన్నట్టు అనిపిస్తోంది. రేపటి ఎన్నికల్లో బీజేపీ 200 సీట్లకు పరిమితం అయితే అప్పుడు మిగిలిన ప్రాంతీయ పార్టీలన్నీ కాంగ్రెస్ అధ్యక్షుడు రాహుల్ గాంధీకి మద్దతు ఇచ్చేందుకు ఇష్టంగా లేరట. మాయావతి, మమతా బెనర్జీ లాంటి నేతలు రాహుల్కు ఎలాగో మద్దతు ఇవ్వరని వీరు చెబుతున్నారు. అలాగే ప్రాంతీయ పార్టీల కన్నా కాంగ్రెస్ పార్టీకి ఎక్కువగా 100 నుంచి 120 సీట్ల వరకు వస్తే రాహుల్ ఈ ప్రాంతీయ పార్టీ నేతలను ప్రధాన మంత్రిగా చేసేందుకు మద్దతు ఇచ్చే ప్రసక్తే ఉండదట. ఈ టైమ్లో మధ్య మార్గంగా అటు రాహుల్కు ఇటు ఈ ప్రాంతీయ పార్టీల నేతలను ఒప్పించి చంద్రబాబు ప్రధాన మంత్రి అవుతారని టీడీపీ వాళ్లు చెబుతున్నారు. ఇక ఇక్కడ ఏపీలో రిజల్ట్ ఏ మాత్రం తేడా వచ్చినా చంద్రబాబుకు ఎలాగో ప్రధాన మంత్రి అయ్యేందుకు మాత్రమే ఆప్షన్ ఉంటుంది.. వచ్చే ఎన్నికలకు ఎలాగో లోకేష్ను సీయం చెయ్యాలని చంద్రబాబు ఆరాటపడుతున్నారు. ఇప్పుడు ఆయన దృష్టి అంతా పీఎం పీఠం మీదే ఉందని టీడీపీ హార్డ్ కోర్ టీంలో నడుస్తున్న ఇన్నర్ టాక్.
ఈ క్రమంలోనే తనకు ఉన్న పాత పరిచయాలన్నిటినీ ఉపయోగించి చంద్రబాబు అటు మమతా బెనర్జీ ఇటు మాయవతితో పాటు తమిళనాడులో బద్ద శత్రువులుగా ఉన్న డీఎంకే, అన్నా డీఎంకేలను సైతం ఒకే తాటి మీదకు తెస్తున్నారట. ఏదేమైనా ఏపీలో ఫలితం తేడా కొడితే చంద్రబాబు ప్రధాన మంత్రి పీఠంపై ఓ కర్చీఫ్ వేసినట్టు కనపడుతోంది. గతంలో ఎన్టీఆర్కు ప్రత్యామ్నాయంగా చంద్రబాబు, దేవగౌడకు ప్రత్యామ్నాయంగా ఐకె.గుజ్రాల్, ఇక ఇటీవల కర్నాటకలో చాలా తక్కువ సీట్లు వచ్చిన కుమార స్వామి అదృష్టం కలిసి వచ్చి ఎలా ముఖ్య మంత్రి అయ్యారో అని టీడీపీ వాళ్లు చంద్రబాబు పీఎం అవుతారంటూ ఉదాహరణలు కూడా చెబుతున్నారు. ఓవర్ ఆల్గా టీడీపీలో చంద్రబాబుకు అత్యంత నమ్మకస్తులుగా ఉండే ఈ హార్డ్ కోర్ టీం అంచనాలను బట్టీ ఏపీలో టీడీపీ ప్రభుత్వం ఘోరంగా ఓడిపోతుందన్న నిర్ణయానికి వారు వచ్చేసినట్టు తెలుస్తోంది. ఇక వీరి ఆశలన్నీ ఇప్పుడు ఢిల్లీ పీఠం మీదే ఉన్నాయట. కేవలం 25 లోక్సభ సీట్లు ఉన్న రాష్ట్రానికి చెందిన చంద్రబాబే ముఖ్య మంత్రి అయితే 42 సీట్లు ఉన్న మమతా బెనర్జీ, 80 సీట్లు ఉన్న మాయవతి వీళ్లకు ఇంకెంత ఆశ ఉండాలన్న విషయం టీడీపీ శ్రేణులకు తెలియకనా...? లేదా తెలిసే ఏపీలో పోతోన్న పరువు కోసం ఆడుతున్న డ్రామానో అర్థంకాని పరిస్థితి.