తెలంగాణ ముఖ్యమంత్రి, టీఆర్ఎస్ పార్టీ అధినేత కేసీఆర్ చిరకాల వాంచ నెరవేరేది వచ్చే నెలలోనేనా? అందుకే ఆయన ఇంత దూకుడుగా వ్యవహరిస్తున్నారా? అంటే అవుననే సమాధానం వస్తోంది. కాంగ్రెస్ ముక్త్ తెలంగాణ అనే కలను నెరవేర్చుకునే తుది అంకానికి కేసీఆర్ చేరుకున్నట్లు తెలుస్తోంది. కాంగ్రెస్ శాసనసభా పక్షాన్ని(సీఎల్పీ) టీఆర్ఎస్ లో విలీనంచేసేందుకు అవసరమైన సంఖ్యా బలం సంతరించుకోవడం అనే కల త్వరలో నెరవేరనుందని తెలుస్తోంది. జూన్ మొదటి వారంలో దీనికి అధికారిక ముద్ర వేసుకోనుంది.
కాంగ్రెస్ నుంచి పార్టీ గెలిచిన 19 మంది ఎమ్మెల్యేల్లో ఇప్పటికే పది మంది ఎమ్మెల్యేలు గులాబీ గూటికి చేరుకున్నారు. ఎమ్మెల్యేలు ఆత్రం సక్కు, రేగా కాంతారావు, బానోతు హరిప్రియా నాయక్, చిరుమర్తి లింగయ్య, సబితా ఇంద్రారెడ్డి, హర్షవర్ధన్ రెడ్డి, కందాళ ఉపేందర్ రెడ్డి, వనమావెంకటేశ్వర్ రావు, సుధీర్ రెడ్డి, జాజుల సురేందర్ పార్టీ మారిన వారిలో ఉన్నారు. మరో ముగ్గురు నేతలు టీఆర్ఎస్ బాటపట్టినట్లు సమాచారం. దీంతో టీఆర్ఎస్లో చేరిన కాంగ్రెస్ ఎమ్మెల్యేల సంఖ్య 13 కు చేరుకుంటుంది. దీంతో కాంగ్రెస్ శాసనసభా పక్షాన్ని టీఆర్ఎస్లో విలీనంచేసేందుకు లైన్ క్లియర్ అవుతుంది.
కాగా, రాబోయే జడ్పీటీసీ, ఎంపీటీసీ ఎన్నికల్లో పే కొత్తగా ముగ్గుర్ని టీఆర్ఎస్లో చేర్చుకొని మరోసారి కాంగ్రెస్ నేతలకు ఝలక్ ఇవ్వాలని గులాబీ నేతలు వ్యూహరచన చేస్తున్నారు. దీంతో జడ్పీటీసీ, ఎంపీటీసీ ఎన్నికలు ఏకపక్షంగా తమ వైపే ఉంటాయని భావిస్తున్నారు. తాజాగా ఎమ్మెల్యేలు రేగా కాంతారావు, చిరుమర్తి లింగయ్య, హరిప్రియ నాయక్ హైదరాబాద్లో మీడియాతో మాట్లాడుతూ “ఆ ముగ్గురు మాత్రమే కాంగ్రెస్ లో మిగులుతారు. మిగిలిన వారంతా టీఆర్ఎస్లోకే వస్తారు. మూడు, నాలుగు రోజుల్లో టీఆర్ఎస్ఎల్పీలో కాంగ్రెస్ విలీన ప్రక్రియ పూర్తవుతుంది. విలీనానికి సంబంధించి న్యాయ నిపుణులతో చర్చిస్తున్నాం” అంటూ ఎమ్మెల్యేలు తమ వ్యూహాన్ని స్పష్టంచేశారు.