ఏపీలో పార్టీ నీ ఆవిర్భావం నుంచి రాజకీయంగా చక్రం తిప్పుతున్న ఇద్దరు టిడిపి సీనియర్ నేతలకు వారి వారసులే ఆ సీనియర్ నేతల పాలిట సైంధవులుగా మారారు. మూడున్నర దశాబ్దాల పాటు టిడిపిలో ఓ వెలుగు వెలిగిన ఆ సీనియర్ నేతలు ఇప్పుడు తమ వారసుల తీరుతో రాజకీయంగా తీవ్రమైన సంకట స్థితిలో ఉన్నారు. గుంటూరు జిల్లాకు చెందిన ఓ సీనియర్ నేత తెలుగుదేశం పార్టీలో అనుభవించాల్సిన పదవులు అనుభవించేశారు. వాస్తవంగా చూస్తే రాజకీయంగా ఆ సీనియర్ నేత గత దశాబ్ద కాలంగా గడ్డు పరిస్థితిని ఎదుర్కొంటున్నారు. గత ఎన్నికల్లో ఆయన ఎలా గెలిచారో ఎవ్వరికి అర్థం కాని పరిస్థితి. చావు తప్పి కన్ను లొట్టపోయిన చందంగా గెలిచిన ఆ సీనియర్ నేతకు చంద్రబాబు కంట్రోల్ చేసే పదవి ఇచ్చారు. జిల్లాకు చెందిన సీనియర్ ఎమ్మెల్యేలు అంతా ఆ సీనియర్ నేతకు కేబినెట్లో బెర్త్ ఇస్తే తాము కనీసం తమ నియోజకవర్గాల్లో కూడా బతికే పరిస్థితి ఉండదని చంద్రబాబుకు విన్నవించుకోవడంతో బాబు వ్యూహాత్మకంగానే ఆ సీనియర్ నేతను అణగ తొక్కారన్న ప్రచారం టిడిపి వర్గాల్లోనే ఉంది.
సన్ స్ట్రక్ గట్టిగా తగలడంతో ఈ ఎన్నికల్లో ఆయన గెలిచేందుకు ఎన్ని ప్రయత్నాలు చేసినా అవి సత్ఫలితాలు ఇచ్చే పరిస్థితి లేదని గుంటూరు జిల్లాలో ప్రతి ఒక్కరూ కోడై కూస్తున్నారు. ఇక ఉత్తరాంధ్రలోని మరో కీలక జిల్లాకు చెందిన సీనియర్ నేత పరిస్థితి కూడా ఇంచుమించు ఇలాగే ఉంది. సదరు సీనియర్ నేత ఈ ఎన్నికల్లో తాను పోటీ నుంచి తప్పుకుని తన వారసుడిని రంగంలోకి దింపాలని అనుకున్నారు. తాను పోటీ చేసే సిట్టింగ్ స్థానాన్ని త్యాగం చేసి తన వారసుడుకి ఎమ్మెల్యే సీటు ఇప్పించుకోవడం లేదా కనీసం ఎంపీ సీటు ఇప్పించుకోవాలని అయినా చివరి వరకు విశ్వప్రయత్నాలు చేశారు. ఆ పుత్రరత్నం చేసిన పనికి ఆ సీనియర్ నేత కుటుంబంలో ఇప్పటికే తీవ్రమైన విభేదాలు వచ్చాయి.
సదరు సీనియర్ నేతకు సొంత సోదరులతోనే కుమారుడు వల్ల గ్యాప్ వచ్చింది. సొంత కుటుంబ సభ్యుల అందకపోవడంతో ఆ ఎఫెక్ట్ ఆ సీనియర్ నేత నియోజకవర్గంలో గట్టిగా ఉన్నట్టు తెలుస్తోంది. అక్కడ వైసీపీ నుంచి పోటీ చేసిన అభ్యర్థిపై ఉన్న సానుభూతి నేపథ్యంలో ఆ నేత గెలుపు సందేహంగానే ఉంది. గత ఎన్నికల్లోనే ఆ నేత ఓటమి నుంచి చివర్లో బయటపడడంతో పాటు బాబు కేబినెట్లో మంత్రి పదవి దక్కించుకున్నారు. ఈ సారి గెలుపు అంత సులువు కాదని స్పష్టంగా తెలుస్తోంది. ఇక గుంటూరుకు చెందిన సీనియర్ నేత రాజకీయ భవిష్యత్తుకు తెరపడినట్టే టిడిపి వర్గాల్లో ప్రచారం జరుగుతోంది. ఇప్పుడు ఉత్తరాంధ్రలో ఆ సీనియర్ నేత పరిస్థితి సైతం ఇంచుమించు అలాగే ఉన్నట్లు టాక్. ఏదేమైనా తెలుగు రాజకీయాల్లో మూడున్నర దశాబ్దాలుగా ఓ వెలుగు వెలిగిన ఈ ఇద్దరి సీనియర్లకు కొడుకులు విలన్లుగా మారారు.