ఏపీలో గడిచిన 11వ తారీకు జరిగిన సార్వత్రిక, అసెంబ్లీ ఎన్నికల్లో అనేక చిత్రాలు కనిపించాయి. ప్రభుత్వం ఒక పక్క తమ పథకాలు, ప్రజల సంక్షేమం వంటివి భారీ ఎత్తున ప్రభావం చూపిస్తాయని ప్రచారం చేసినా.. అండర్ కరెంటుగా మాత్రం ఎమ్మెల్యేలపైనా, ఎంపీలపైనా ప్రజలకు ఉన్న ఆగ్రహం మాత్రం ఓట్లరూపంలో కనిపించిందని అంటున్నారు. రాష్ట్రంలో ని చాలా నియోజకవర్గాల్లో సిట్టింగ్ ఎమ్మెల్యేలపై ప్రజలు పీకల వరకు కోపంతో ఉన్నారు. బహుశ ఈ విషయాన్ని ముందు గానే గ్రహించారో ఏమో.. టీడీపీ అధినేత చంద్రబాబు తనను చూసి ఓటేయాలని ప్రచారం చివరి రోజుల్లో నెత్తీనోరూ బాదు కుని మరీ ప్రజలకు విన్నవించారు.
``ఒకరిద్దరు మిమ్మల్ని బాధపెట్టారని బాధపడొద్దు. వచ్చే ఎన్నికల్లో మా పార్టీకి ఓట్లేయండి. నాయకులను మీకు చేరువ చేస్తాను. మీ సమస్యలపై దృష్టి పెడతాను`` అని చంద్రబాబు పదేపదే చెప్పుకొచ్చారు. అయితే, అప్పటికే చేతులు కాలిపోయిన పరిస్థితి టీడీపీలో కనిపించింది. ఇసుక దందాలు సహా అనేక రూపాల్లో ప్రజలు ఇబ్బందులు పడుతున్నారు. పేరుకే ఉచిత ఇసుక.. కానీ, సాధారణ రోజుల్లో అంటే ఉచితం అన్న బోర్డు లేనప్పుడు కంటే కూడా దారుణంగా ప్రజలు డబ్బులు ఖర్చు చేసి ఇసుకను కొనుగోలు చేయాల్సిన పరిస్థితి ఏర్పడింది. ఇది ప్రజల్లో తీవ్ర వ్యతిరేకతను తీసుకువచ్చిం ది. ఇక, కృష్ణాజిల్లాలోని ఓనియోజకవర్గంలో ఎమ్మెల్యేపై ఎలాంటి అవినీతి మరకలు లేకపోయినా.. ఆయన అన్నదాతల సమస్యలను పరిష్కరించలేదనే అపవాదును మూటగట్టుకున్నారు.
దీంతో ఇప్పుడు ఈ ఎన్నికల్లో సదరు ఎమ్మెల్యేకు రైతన్నల ఆగ్రహమే శాపంగా మారుతుందన్న చర్చలు నియోజకవర్గంలో నడుస్తున్నాయి. విజయవాడ నగరానికి ఆనుకుని అతి సమీపంలోనే ఉన్న ఈ నియోజకవర్గంలో చెరుకు రైతులు ఎక్కువగా ఉన్నారు. ఈ నియోజకవర్గంలో వారి సమస్యలు నేటికీ అపరిష్కృతంగానే ఉన్నాయి. వ్యవసాయ నేపథ్యం ఉన్న కుటుంబం నుంచి వచ్చాడనే సానుభూతితో 2014లో సదరు నాయకుడికి ప్రజలు జైకొట్టారు. అయితే, మూతబడిన చెరకు ఫ్యాక్టరీలను తెరిపించడంలోను, విమాశ్రయ విస్తరణకు ఇచ్చిన రైతుల భూములకు సరైన పరిహారం ఇప్పించడంలోనూ ఆ ఎమ్మెల్యే పూర్తిగా చేతులు ఎత్తేశారు. అదే సమయంలో కాంగ్రెస్ నేతల నుంచి వచ్చిన విమర్శలు కూడా ఎమ్మెల్యేకు ఇబ్బంది కరంగా మారాయి.
మొత్తంగా ఎమ్మెల్యే మంచి వాడే అయినా.. ఆయన పనితీరుకు మాత్రం మైనస్ మార్కులు పడ్డాయి. దీంతో సదరు ఎమ్మెల్యే గెలుపు అంత ఈజీ కాదని అంటున్నారు. ఈ ఎన్నికల్లో ఆయన వైసీపీ నుంచి తన సామాజికవర్గానికే చెందిన ఆర్థికంగా బలమైన వ్యక్తి నుంచి గట్టి పోటీ ఎదుర్కొన్నారు. ఎన్నికలు ముగిసిన తర్వాత ఆయన అసలు మీడియా ముఖం కూడా చూడకపోవడం వెనుక సర్వే నివేదికలే కారణమని అంటున్నారు. మరి ఏం జరుగుతుందో చూడాలి.