తెలంగాణ ఇంటర్ ఫలితాలపై నెలకొన్న వివాదానికి సంబంధించి సీఎం కేసీఆర్ కీలక నిర్ణయం తీసుకున్నారు. ఇంటర్లో ఫెయిల్ అయిన విద్యార్థులకు ఉచితంగా రీవాల్యుయేషన్, ఫ్రీ రీకౌంటింగ్కు అవకాశం కల్పించాలని అధికారులను సీఎం ఆదేశించారు. రీవాల్యుయేషన్, రీకౌంటింగ్ను వీలైనంత త్వరగా పూర్తిచేయాలన్నారు. అదే విధంగా విద్యార్థులు విద్యా సంవత్సరం కోల్పోకుండా అడ్వాన్స్డ్ సప్లిమెంటరీ నిర్వహించాలని కేసీఆర్ ఆదేశించారు. వివాదాలకు తావులేకుండా పరీక్షల నిర్వహణను స్వతంత్ర సంస్థకు ఇచ్చే అవకాశాలను పరిశీలించాలని అధికారులకు సూచించారు.
రీవాల్యుయేషన్, రీకౌంటింగ్, సప్లిమెంటరీ పరీక్షల నిర్వహణ బాధ్యతలను విద్యాశాఖ కార్యదర్శి జనార్దన్ రెడ్డి అప్పగించారు. భవిష్యత్లో ఇలాంటి ఘటనలు పునరావృతం కాకుండా ప్రణాళికలు సిద్ధం చేయాలని ఆదేశించారు. సీఎం కేసీఆర్ నిర్ణయంతో దాదాపు 3 లక్షల మంది విద్యార్థులకు రీవాల్యుయేషన్, రీ కౌంటింగ్కు వెసులుబాటు లభించనుంది. కాగా, ఇంటర్ ఫలితాల గోల్మాల్ వ్యవహారం రోజు రోజుకు ముదురుతుండటంతో ముఖ్యమంత్రి కేసీఆర్ స్పందించారు. విద్యాశాఖ మంత్రి జగదీశ్ రెడ్డి, విద్యాశాఖ కార్యదర్శి జనార్ధన్ రెడ్డి, ఇంటర్ బోర్డు చైర్మన్తో సమీక్ష జరిపారు. ఈ వ్యవహారంలో అధికారుల తీరుపై కేసీఆర్ తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేసినట్లు తెలుస్తోంది.
ఇంటర్ జవాబు పత్రాల పునఃమూల్యాంకనం, పునః లెక్కింపు కోసం ఎనిమిది కేంద్రాలను ఇంటర్మీడియట్ బోర్డు ఏర్పాటు చేసింది. అన్ని కేంద్రాలను హైదరాబాద్లోనే ఏర్పాటు చేస్తూ నిర్ణయం తీసుకుంది.
హైదరాబాద్లో ఎనిమిది కేంద్రాలు ఏర్పాటు:
1.గన్ఫౌండ్రి మహబూబియా జూనియర్ కళాశాల
2.నాంపల్లి ఎంఏఎం జూనియర్ కళాశాల
3.కాచిగూడ ప్రభుత్వ కళాశాల
4.ఫలక్నుమా ప్రభుత్వ బాలుర కళాశాల
5.హయత్నగర్ ప్రభుత్వ జూనియర్ కళాశాల
6.శంషాబాద్ ప్రభుత్వ జూనియర్ కళాశాల
7.మేడ్చల్ జిల్లా డీఐఈవో కార్యాలయం
8.కూకట్పల్లి ప్రభుత్వ జూనియర్ కళాశాల