ఏపీ ముఖ్యమంత్రి, తెలుగుదేశం పార్టీ అధ్యక్షుడు నారా చంద్రబాబు నాయుడు కేంద్ర ఎన్నికల కమిషన్కు రాసిన లేఖ రాజకీయవర్గాల్లో తీవ్ర చర్చనీయాంశంగా మారుతోంది. ఎన్నికల ఫలితాలు వెలువడే వరకు ముఖ్యమంత్రి విధులు నిర్వహించడంపై విధించిన ఆంక్షల విషయంలో చంద్రబాబు భగ్గుమంటూ ఈ లేఖ రాసిన సంగతి తెలిసిందే. అయితే, ఈ లేఖపై వైసీపీ ప్రధాన కార్యదర్శి సజ్జల రామకృష్ణారెడ్డి ఎద్దేవా చేశారు.
వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ రాష్ట్ర కార్యాలయంలో ఆయన మీడియాతో చంద్రబాబు లేఖపై కామెంట్లు చేశారు. రాష్ట్రంపై ఆజన్మాంతం తనకు హక్కు ఉందని ఆ హక్కును ఎన్నికల కమీషన్ తీసేసి రాష్ట్రానికి అన్యాయం చేస్తున్నట్లుగా చంద్రబాబు విన్యాసాలు ఉన్నాయన్నారు. తన అనుకూల మీడియా ద్వారా, ప్రచారబలం ద్వారా ప్రసారసాధనాలద్వారా వాటిపైఉన్న పట్టు ద్వారా ఆయనకు ఉన్న హక్కును నిజంగా కాలరాస్తున్నట్లుగా ప్రచారం చేస్తున్నారని మండిపడ్డారు.
బాధ్యతగల ప్రతిపక్షంగా అసలు విషయం ప్రజలకు తెలియచేయాలనే దిశగా తాము స్పందిస్తున్నామన్నారు. ``సాధారణంగా నూతన ప్రభుత్వంకు వేదిక సిద్దం చేసేవిధంగా చంద్రబాబు వ్యవహరించాలి.అది ఏ పార్టీ ప్రభుత్వం అయినా కావచ్చు. చంద్రబాబు అందుకు భిన్నంగా వ్యవహరిస్తున్నారు. చంద్రబాబు కేవలం 1.5 శాతం తేడాతో గెలిచారు.అత్తెసరు ఓట్లతో అధికారంలోకి వచ్చారు. 70 ఏళ్ల వయస్సులో మనవడితో ఆడుకుంటూనో యాత్రలు చేయాల్సిన వ్యక్తి రోజూ రకరకాల ప్రకటనలతో గందరగోళ పరిస్దితులు సృష్టిస్తున్నారు.`` అని వెల్లడించారు.
ముఖ్యమంత్రినైన తాను రివ్యూలు చేయకపోతే రాష్ట్రంలో ఏదైనా జరిగితే, ఖర్చులు విపరీతంగా పెరిగిపోతే దీనికి ఈసినే కారణం అవుతుందని కూడా చంద్రబాబు లేఖలో పేర్కొన్నారని విజయసాయిరెడ్డి అన్నారు. ``పిడుగులు పడి గత వారం ఏడుగురు చనిపోయారని, ఇదే నా ఆధ్వర్యంలోని ప్రజాస్వామ్యప్రభుత్వ పాలన ఉంటే ఇలా జరిగిఉండేది కాదని చెప్పడం హాస్యస్పదంగా ఉంది. చంద్రబాబు చెప్పేది ఏమంటే తాను రివ్యూలు చేసి ఉంటే పిడుగులు కూడా ఆపేవాడిని అని లెటర్ లో పేర్కొన్నారు.
ఈ ఐదేళ్లలో ఎన్నిసార్లు పిడుగులు ఆపగలిగారో చెప్పగలరా? ఈ లెటర్ లో రాసిన వ్యాఖ్యలు చూస్తే ఎంత ప్రస్టేషన్ లో ఉన్నారో అర్దమవుతుంది. ఆయనకు బాకా ఊదే పత్రికలు,ఛానల్స్ లో ఈ అంశం (పిడుగులు ఆపే)పెట్టరేమో ఎందుకంటే వారికే సిగ్గునపిస్తుంది అనుకుంటున్నాను.`` అంటూ చంద్రబాబు తీరును ఎద్దేవా చేశారు.