తన పాలనలో అన్నీ అద్భుతాలే అని ప్రచారం చేసుకుంటున్న ఏపీ ముఖ్యమంత్రి, తెలుగుదేశం పార్టీ అధ్యక్షుడు చంద్రబాబు నాయుడు...పరిపాలనపై కాకుండా ప్రచారం చేసుకోవడం వల్ల జరిగిన విపరిణామాల్లో మరో అంశం తెరమీదకు వచ్చింది. ఉమ్మడి రాజధానిగా తనకు హైదరాబాద్పై హక్కు ఉందని ప్రకటించుకునే బాబు...హైదరాబాద్లోని ఏపీ సచివాలయాన్ని పట్టించుకోకపోవడంతో...సాక్షాత్తు సెక్రటేరియట్కు నీటి సరఫరా కట్ అయ్యే పరిస్థితి ఎదురైంది.
వివరాల్లోకి వెళితే...ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర విభజన చట్టం ప్రకారం పాత సచివాలయంలోని నాలుగు బ్లాకులు ఏపీకి కేటాయించారు. 2014 నుంచి ఈ భవనాలను ఏపీ వినియోగిస్తోంది. జలమండలి నీటిని సరఫరా చేస్తుండగా ఏపీ సర్కారు బిల్లులను చెల్లించడం లేదు. ఇలా ఏపీ సచివాలయం రూ.3.5కోట్లు బకాయిపడినట్లు అధికారులు గుర్తించారు. ఈ బకాయిలు చెల్లించాలని ఏపీ జీఐడీ విభాగానికి లేఖలు రాస్తున్నా, ఎలాంటి స్పందన లేదు. తాజాగా ఏపీ అధికారులతో సమావేశమై బకాయిలు చెల్లించాలని కోరారు.
అయితే, దీనిపై ఏపీ అధికారులు ఆసక్తికరమైన సమాధానం ఇచ్చారు. రెండేళ్లుగా ఆ భవనాల్లో కార్యకలాపాలు సాగించడం లేదని, తామెలా బిల్లులు చెల్లిస్తామని ఏపీ అధికారులు చెప్పినట్లు తెలుస్తోంది. ప్రస్తుతం డివిజన్ నంబర్–4 పరిధిలోని సచివాలయానికి నల్లా లైన్ తొలగించాలా లేదా అనే అంశంపై జలమండలి యోచిస్తోంది. పెండింగ్ బిల్లులు చెల్లించని ప్రభుత్వ రంగ సంస్థలకు నల్లా నీటిని తొలగించిన దాఖలాలు ఇప్పటివరకు లేవు. ఏపీ సచివాలయం విషయంలో ఎలాంటి నిర్ణయం తీసుకుంటున్నారనే అంశం చర్చనీయాంశంగా మారింది.