“నీతులు చెప్పేవాళ్లు వాటిని పాటించాల్సిన అవసరం లేదు” అని టివి9 మాజీ సిఈఓ, రవిప్రకాష్ - తన ప్రవర్తన ద్వారా ఋజువు చేశారు. టీవీ9 సంస్థ విషయంలో సినీ నటుడు శివాజీ కూడ కుట్రపూరితంగా వ్యవహరించారని అలంద మీడియా సంస్థ ఆరోపిస్తోంది. టీవీ9 ఛానెల్ లో తన ఇష్టానుసారంగా వ్యవహరించాలనే నిర్ణయం మేరకు రవిప్రకాష్ కొత్త యాజమాన్యాన్ని అడ్డుకొనే ప్రయత్నం చేశారని ఆ సంస్థ చెబుతోంది.
"అలంద మీడియా సంస్థ" కొనగోలు చేసిన "అసోసియేటెడ్ బ్రాడ్కాస్టింగ్ కంపనీ ప్రైవేట్ లిమిటెడ్-ఏబిసిఎల్" యాజమాన్య మార్పును, కొత్త డైరెక్టర్ల నియామకాలను అడ్డుకునేందుకు రవిప్రకాశ్ ఎన్నో అడ్డదారులు తొక్కారని అలంద మీడియా సంస్థ ప్రకటించింది. రవిప్రకాశ్ అక్రమాలపై కూడా అలంద మీడియా పోలీసులకు ఫిర్యాదు చేసింది. రవిప్రకాశ్, సినీ నటుడు శివాజీతో కలిసి కుట్ర పూరితమైన చర్యలకు పాల్పడ్డారని అలంద సంస్థ ఆరోపించింది. ఏబీసీఎల్ యాజమాన్యానికి కంపెనీకి నష్టం కలిగించే చర్యలకు పాల్పడ్డారని పోలీసులకు ఇచ్చిన ఫిర్యాదులో పేర్కొంది.
ఈ ఏడాది ఏప్రిల్ 19వ తేదీన సినీ నటుడు శివాజీ హైదరాబాద్ లోని "నేషనల్ కంపెనీ లా ట్రిబ్యునల్" ని ఆశ్రయించారు. ఏబీసీఎల్ లో రవిప్రకాశ్ కు 20 లక్షల షేర్లు అంటే 8 శాతం వాటా ఉంది. ఇందులో నుంచి 40 వేల షేర్లను కొనుగోలు చేసేందుకు రవిప్రకాశ్కు 20 లక్షల రూపాయలు చెల్లించి ఫిబ్రవరి 20, 2018 న ఒప్పందం కుదుర్చుకున్నానని ఆయన ఆ ఫిర్యాదులో పేర్కొన్నారు. ఈ ఒప్పందం జరిగిన ఏడాది లోగా షేర్లను తన పేరు మీద బదిలీ చేసేందుకు రవిప్రకాశ్ అంగీకరించారని ఆరోపించారు. తాను అతని మీద నమ్మకం ఉంచానని శివాజీ పేర్కొన్నారు.
ఏబీసీఎల్లో యాజమాన్య మార్పులకు సంబంధించి రవిప్రకాశ్ కొన్ని నిజాలను తన వద్ద దాచారని శివాజీ ఆరోపించారు.అంతేకాదు మోసపూరితంగా వ్యవహరించారని ఆయన ఫిర్యాదు చేశారు. షేర్ల బదిలీ గురించి తాను పలు మార్లు రవిప్రకాశ్కు గుర్తు చేసినా ఏదో ఒక సాకు చూపుతూ షేర్లు బదిలీ చేయలేదన్నారు. దీంతో తాను విసిగిపోయి ఈ ఏడాది (2019) ఫిబ్రవరి 15న రవిప్రకాశ్కు స్వయంగా నోటీసు అందజేశానని శివాజీ ఎన్సీఎల్టీ వద్ద దాఖలు చేసిన తన అఫిడవిట్ లో పేర్కొన్నారు
అయితే దీనికి రవి ప్రకాశ్ ఫిబ్రవరి 17న స్పందించారు. షేర్ల బదిలీలో జాప్యానికి ఎన్సీఎల్టీ జారీ చేసిన ఒక మధ్యంతర ఉత్తర్వు కారణమన్నారు.ఎన్సీఎల్టీ లో ఉన్న ఈ వివాదం పరిష్కారమైన తర్వాత షేర్లు బదిలీ చేస్తానని సమాధానం ఇచ్చారు. రవిప్రకాశ్, శివాజీల మధ్య 2018 ఫిబ్రవరిలో జరిగినట్లుగా చెబుతున్న షేర్ పర్చేజ్ అగ్రిమెంట్ కేవలం తెల్ల కాగితాలపై ఉందని అలందా మీడియా సంస్థ ఆరోపిస్తోంది.
ఎవరైనా వాటా కొనుగోలు చేస్తే తక్షణం షేర్ల బదిలీ కోరుకుంటారు, కానీ, శివాజీ ఇందుకు ఏడాది గడువు ఇచ్చాననడం అనుమానాలను కలిగిస్తోందని ఆ సంస్థ ప్రతినిధులు అనుమానాలు వ్యక్తం చేస్తున్నారు. ఎవరైనా వాటా కొనుగోలు చేస్తే తక్షణం షేర్ల బదిలీ కోరుకుంటారు, కానీ, శివాజీ ఇందుకు ఏడాది గడువు ఇచ్చాననడం అనుమానాలను కలిగిస్తోంది. ఈ అనుమానాల వల్లే శివాజీ, రవిప్రకాశ్ మధ్య కుదిరినట్లు చెప్పబడేది ఒప్పందం కాదు ఒక కుట్రగా చెప్పబడుతుంది. దీన్ని ఫోర్జరీ ఒప్పందంగా టీవీ9 కొత్త యాజమాన్యం భావిస్తోంది. కొత్త యాజమాన్యానికి ఇబ్బందులు కలిగించే ఉద్దేశ్యంతో రవిప్రకాశ్, శివాజీ తో కలిసి కుమ్మక్కై ఈ నాటకానికి తెర తీశారని ఏబీసీఎల్ కొత్త యాజమాన్యం తన ఫిర్యాదులో పేర్కొంది.
ఏబీసీఎల్ లో పెట్టుబడికి సంబంధించి తలెత్తిన ఒక వివాదంలో మారిషస్కు చెందిన 'సైఫ్ త్రీ మారిషస్ కంపెనీ లిమిటెడ్' అనే సంస్థ జనవరి, 2018 లో ఎన్సీఎల్టీ ని ఆశ్రయించింది. ఈ విషయమై విచారణ జరిపిన ఎన్సీఎల్టీ, ఏబీసీఎల్ తన ఆస్తులను కానీ, షేర్లను కానీ అమ్మరాదని గత ఏడాది సెప్టెంబర్ 4, 2018 న ఒక మధ్యంతర ఉత్తర్వును జారీ చేసింది. ఈ ఆదేశాలను యదావిధిగా కొనసాగిస్తూ ఎన్సీఎల్టీ ఈ ఏడాది జనవరి 21న మరో మధ్యంతర ఉత్తర్వును ఇచ్చింది. ఆ తర్వాత శ్రీనిరాజుకు, 'సైఫ్ త్రీ మారిషస్కంపెనీ లిమిటెడ్' కు మధ్య సెటిల్మెంట్ ఒప్పందం కుదిరింది.
ఈ విషయాన్ని గత వారం ఎన్సీఎల్టీ కి తెలియపరిస్తూ ఉపసంహరణ పిటిషన్ను ఇరుపక్షాలు దాఖలు చేశాయి. దీనికి సంబంధించి ఎన్సీఎల్టీ తుది ఉత్తర్వులను వెలువరచాల్సి ఉంది. అయితే ఏబీసీఎల్ కంపెనీ షేర్లు కలిగి ఉన్న వ్యక్తుల మధ్య లావాదేవీలపై మాత్రం ఎన్సీఎల్టీ మధ్యంతర ఉత్తర్వుల్లో ఎలాంటి ఆంక్షలు లేవు. ఎన్సీఎల్టీ ఉత్తర్వులు గత ఏడాది సెప్టెంబర్ 4 వెలువడితే ఈ విషయం తనకు కొద్ది రోజుల ముందే తెలిసిందని ఆ కంపెనీ సీఈవో, డైరెక్టర్ గా ఉన్న రవిప్రకాశ్ మార్చి 17, 2019 న శివాజీకి లిఖిత పూర్వకంగా చెప్పడం అనుమానాలకు తావిస్తోందని అలంద సంస్థ అనుమానిస్తోంది.
ఎన్సీఎల్టీ ఉత్తర్వులు వచ్చిన తర్వాత కూడా, కొత్త యాజమాన్యానికి సంబంధించిన నలుగురు డైరెక్టర్లను ఏబీసీఎల్ బోర్డులో చేర్చుకునేందుకు 2018 అక్టోబర్ లో ఒకసారి, 2019 జనవరిలో మరోసారి, బోర్డు మీటింగులు నిర్వహించిన విషయాన్ని ఆ ప్రతినిధులు గుర్తు చేస్తున్నారు. ఎన్సీఎల్టీ ఉత్తర్వులిచ్చిన తర్వాత కూడ కొత్త యాజమాన్యానికి సంబంధించిన నలుగురు డైరెక్టర్లను ఏబీసీఎల్ లో చేర్చుకొనేందుకు గత ఏడాది అక్టోబర్లో, ఈ ఏడాది జనవరిలో బోర్డు సమావేశాలు నిర్వహించి తీర్మాణాలు చేశారు.అంతే కాదు కేంద్ర సమాచార మంత్రిత్వశాఖ అనుమతి కోరిన సమయంలో కూడ రవి ప్రకాష్ సానుకూలంగానే ఉన్నారని అలంద మీడియా గుర్తు చేస్తోంది.
కానీ తన వద్ద ఉన్న 40 వేల షేర్లను శివాజీకి బదలాయించడానికి ఉన్న అడ్డంకి ఏమిటో అర్ధం కావడం లేదని అలంద సంస్థ ప్రశ్నిస్తోంది. ఈ వ్యవహారం ఇద్దరు వ్యక్తుల మధ్య జరిగిందేనని ఈ విషయంలో ఏబీసీఎల్కు ఏ మాత్రం సంబంధం లేదని ఆ సంస్థ చెబుతోంది.