ప్రముఖ నటుడు మెగాస్టార్ చిరంజీవికి సంబంధించిన కీలకమైన అప్డేట్లో ఊహించని ట్విస్ట్ చోటుచేసుకుంది. ఇప్పటికే పలు వ్యాపారాలు నిర్వహిస్తున్న చిరంజీవి మరో సరికొత్త రంగంలోకి అడుగుపెట్టనున్నారని...విద్యావేత్తగా మారబోతున్నారని వార్తలు వచ్చిన సంగతి తెలిసిందే.చిరంజీవి ఇంటర్నేషనల్ స్కూల్స్ పేరుతో అధునాతన సౌకర్యాలు, ఏసీ వసతులతో క్యాంపస్లను ఏర్పాటు చేస్తున్నామని సీఈఓ జే శ్రీనివాసరావు తెలిపారు. ఈ అకాడమిక్ ఇయర్ నుంచి మెగా ఫ్యామిలీ చిరంజీవి ఇంటర్నేషనల్ స్కూల్స్ను ప్రారంభించేందుకు రంగం సిద్ధం చేస్తున్నట్లు, శ్రీకాకుళం జిల్లా నుండి ఇందుకు శ్రీకారం చుట్టనున్నట్లు వివరించారు. అయితే, దీనిపై ఊహించని ట్విస్ట్ చోటుచేసుకుంది.
చిరంజీవి ఇంటర్మీషనల్ స్కూల్స్ పేరుతో ఏర్పాటవుతున్న పాఠశాలకు, చిరంజీవికి సంబంధం లేదట. ఈ పాఠశాల చిరంజీవికి చెందినవేనని, వాటి భాధ్యతల్ని నాగబాబు, రామ్ చరణ్ చూసుకుంటున్నారని వచ్చిన వార్తలపై స్పందించిన పాఠశాలల సీఈవో శ్రీనివాస్ రావు పాఠశాల నిర్వహణకు, మెగా కుటుంబానికి ఎలాంటి సంబంధం లేదని స్పష్టం చేశారు. తాము చిరు అభిమానులం కావడంతో తమ సంస్థలకు ఆయన పేరు పెట్టుకున్నామని అన్నారు. అంతేకాదు చిరంజీవి కుటుంబం మీదున్న అభిమానంతో చిరును గౌరవ ఫౌండర్ పదవిలో, నాగబాబును గౌరవ డైరెక్టర్ పదవిలో ఉంచామన్నారు.
కాగా, తొలి ప్రకటనలో విద్యార్థులకు హైటెక్ శిక్షణ ఇచ్చేందుకు మొట్టమొదటి సారిగా శ్రీకాకుళం నగర శివార్లలోని పెద్దపాడు రోడ్డులో మొదటి చిరంజీవి ఇంటర్నేషనల్ స్కూల్ను అన్ని సదుపాయాలతో ఏర్పాటు చేయనున్నట్లు సీఈఓ చెప్పారు. జూన్ మొదటి వారం నుంచి తరగతులు ప్రారంభిస్తున్నట్టు తెలియజేశారు. నర్సరీ నుంచి గ్రేడ్ 5 వరకు ఐజిసిఎస్ఈ, సీబీఎస్ఈలలో తరగతులు నిర్వహిస్తామని చెప్పారు. ఏసీ క్లాస్ రూమ్ లు, ఆడియో విజువల్ ల్యాబ్స్, కంప్యూటర్ ల్యాబ్, సీసీటీవీల ద్వారా పర్యవేక్షణ, పేరెంట్ ,టీచర్ ముఖాముఖి, ఇంగ్లిష్ గ్రామర్, కమ్యూనికేషన్ స్కిల్స్ వాటిపై ప్రత్యేక శ్రద్ధ ఈ ఇంటర్నేషనల్ స్కూల్ ప్రత్యేకతలని వివరించారు.