ఐదేళ్ల పాటు పార్టీ ప్రతిపక్షంలో ఉన్నా రోజా మాత్రం అసెంబ్లీలో టీడీపీపై ఎన్నో పోరాటాలు చేశారు. చివరకు టీడీపీ మహిళా ఎమ్మెల్యేలను నిలువరించడంతో పాటు ఇటు చంద్రబాబుపై సైతం చేసిన వ్యాఖ్యలతో ఆమె యేడాది పాటు అసెంబ్లీ నుంచి సస్పెన్షన్కు గురవ్వడం ఆ తర్వాత సుప్రీంకోర్టును సైతం ఆశ్రయించడం తెలిసిందే. చంద్రబాబును కామ సీఎం అన్న తర్వాత రోజా నేషనల్ మీడియాలోనూ జోరుగా ట్రెండ్ అయ్యారు. రోజా పార్టీ కోసం ఎంతో చేసినా అదే ఇప్పుడు ఆమెకు అటు ప్రత్యర్థి పార్టీ అయిన టీడీపీలోనే కాకుండా... ఇటు విపక్ష పార్టీలోనూ శత్రువులను పెంచేలా చేసిందన్నది ఈ ఎన్నికల్లో స్పష్టమైందన్న గుసగుసలు వైసీపీ వర్గాల్లోనే వినిపిస్తున్నాయి.
రేపు వైసీపీ గెలిచి... జగన్ సీఎం అయితే ఆమెకు లేడీ కోటాలో తప్పనిసరిగా ప్రాధాన్యమైన శాఖే ఇవ్వాల్సి ఉంటుంది. ఇంకా చెప్పాలంటే రోజాకు హోం మంత్రి పదవి ఖాయమని.. తన తండ్రి వైఎస్.. తన సామాజికవర్గానికే చెందిన సబితా ఇంద్రారెడ్డికి ఎలా హోం మంత్రి ఇచ్చారో ? ఇప్పుడు జగన్ కూడా అదే సెంటిమెంట్ ఫాలో అవుతూ రోజాకు కూడా హోం మంత్రి ఇస్తున్నారన్న టాక్ వైసీపీలోనే వినిపించింది... అలాగే రోజా సైతం కాబోయే హోం మంత్రి అన్న చర్చ సోషల్ మీడియాలోనే కాకుండా.. మెయిన్ మీడియాలోనూ బాగా హైలెట్ అయ్యింది.
ఎన్నికలకు ముందే ఈ విషయాన్ని పసిగట్టిన కొందరు వైసీపీ పెద్ద తలకాయలు రోజాను సొంత నియోజకవర్గంలో ఓడించేందుకు తెరవెనక గోతులు తీసినట్టు తెలుస్తోంది. చిత్తూరు జిల్లా వైసీపీలో మహామహాముదుర్లు ఉన్నారు. ఈ ఒక్క జిల్లా నుంచే రోజా సొంత సామాజికవర్గానికి చెందిన వారే ఏకంగా నలుగురు వరకు మంత్రి పదవి ఆశిస్తున్నారు. వీరిలో కొందరు నేతలు రోజా గెలిస్తే రేపు మంత్రి పదవి రేసులో తమకు పోటీ వస్తుందని ఆమె ప్రత్యర్థి వర్గానికి సహకరించడం లేదా ఆ నియోజకవర్గంలో వైసీపీ నేతల్లో కొందరిని ఎన్నికల వేళ సైలెంట్ అయ్యేలా చక్రం తిప్పినట్టు జిల్లాలో చర్చలు జోరుగా నడుస్తున్నాయి.
వాస్తవంగా చూస్తే ఎన్నికలకు ముందు వరకు రోజాకు నగరిలో ఎదురు లేకుండా పోయింది. మళ్లీ రోజానే గెలుస్తారని టీడీపీ అనుకూల మీడియా సర్వేల్లోనే తేలింది. ఇది సహజంగానే సొంత పార్టీలో సీనియర్లకు కాస్త కంటగింపుగా ఉంటే ఉండొచ్చు. ఈ క్రమంలోనే ఆమె ఓటమికి ఎన్నికల్లో తమ వంతుగా తెరవెనక చక్రం తిప్పినట్టు టాక్. రోజా మాత్రం ఎన్నికల్లో గెలుపు కోసం సర్వశక్తులు ఒడ్డారు. యేడాది క్రితమే నగరిలో ఇళ్లు కట్టుకుని ప్రజలకు అందుబాటులో ఉండడంతో పాటు వైఎస్సార్ క్యాంటిన్ల ఏర్పాటు ద్వారా ప్రజల్లోకి బాగా చొచ్చుకుపోయారు. అదే టైంలో అటు ఆమెపై పోటీ చేసిన గాలి ముద్దుకృష్ణమనాయుడు తనయుడు గాలి భానుప్రకాశ్ నాయుడు ఫ్యామిలీలో ఆయన ఓటిమికి పొగపెట్టారు. ఇది రోజాకు అనుకూలమే అయినా ఇటు ఆమెకు సొంత వర్గం నుంచే వెన్నుపోట్లు తగలడం ఇబ్బంది. అయితే వీటిని చిత్తు చేసి రోజా గెలిచి.. జగన్ అధికారంలోకి వస్తే రోజా రికార్డులు క్రియేట్ చేసినట్టే.