ఏపీలో సార్వత్రిక ఎన్నికల ఫలితాలు వెల్లడి అయ్యేందుకు మరో ఐదు రోజులు మాత్రమే మిగిలి ఉంది. 35 రోజులకు పైగా తీవ్రమైన ఉత్కంఠ ఎదుర్కొన్న నేతల టెన్షన్కు ఐదు రోజుల్లో తెరపడిపోనుంది. ఈ నెల 23న రాజు ఎవరో ? తేలిపోనుంది. ఇక పల్లె నుంచి పట్టణాల వరకు పొలిటికల్ బెట్టింగులు జోరందుకున్నాయి. ఏపీ రాజధాని జిల్లా అయిన గుంటూరు జిల్లాలో ఎక్కడా చూసినా ఒక్కటే బెట్టింగులు నడుస్తున్నాయ్. గుంటూరు కేంద్రంగా ఉన్న రెండు క్లబ్లు పొలిటికల్ బెట్టింగులకు పెట్టింది పేరుగా ఉన్నాయ్. ఈ రెండు క్లబ్లలో ఓ క్లబ్లో అయితే భారీ ఎత్తున నగదు చేతులు మారుతోంది.
తెలంగాణ ఎన్నికలప్పుడు కూడా చాలా మంది లగడపాటి రాజ్గోపాల్ సర్వేను బేస్ చేసుకుని భారీగా బెట్టింగులు వేసి మునిగిపోయారు. ఇక ఇప్పుడు నెలన్నర రోజులుగా ఏపీ ఫలితాలపై ఈ రెండు క్లబ్లలో రకరకాల పందేలు నడుస్తున్నాయ్. ఏపీలో వైసీపీ గెలుస్తుందని ఇక్కడ పందెం కాస్తున్న వారి సంఖ్య ఎక్కువుగా ఉంటోంది. ఇప్పటికే కోట్లాది రూపాయలు బెట్టింగ్ జరగగా... ఈ ఐదారు రోజుల్లో ఈ బెట్టింగ్ నేపథ్యంలో మరిన్ని కోట్లు చేతులు మారనున్నాయి.
గుంటూరు జిల్లాలో నడుస్తోన్న బెట్టింగులు చూస్తే సత్తెనపల్లి మీద ఎక్కువుగా బెట్టింగ్ జరుగుతోంది. స్పీకర్ కోడెల శివప్రసాద్రావు ఈ సారి ఖచ్చితంగా ఓడిపోతారని వైసీపీ వాళ్లు ఫుల్ ధీమాతో పందేలకు సై అంటున్నారు. ఈ సీటు వరకు రూపాయికి రెండు రూపాయలు కూడా ఇస్తున్నారు. ఇక నరసారావుపేటలోనూ ఇదే పరిస్థితి నెలకొంది. గత ఎన్నికల్లో ఈ సీటును వైసీపీ 16 వేల ఓట్ల మెజార్టీతో గెలుచుకుంది. ఇప్పుడు మెజార్టీ ఎంత తగ్గినా మళ్లీ ఇక్కడ వైసీపీ జెండాయే ఎగురుతుందని వైసీపీ వాళ్లు పందేలు కాస్తున్నారు. అయినా ఇక్కడ టీడీపీ నుంచి ఎవ్వరూ పందెం కాసేందుకు ముందుకు రాకపోవడంతో నరసారావుపేట సీటుపై వైసీపీ వాళ్లు రూపాయికి మూడు రూపాయిలు ఇచ్చి మరీ పందెం కాస్తున్నారు.
ఇక ఇప్పుడు వైసీపీ మరో పందెం కాస్తోంది. పల్నాడులో నరసారావుపేట ఎంపీ సీటు పరిధిలో ఉన్న నరసారావుపేట, సత్తెనపల్లితో పాటు మాచర్ల ఈ మూడు సెగ్మెంట్లలోనూ వైసీపీయే గెలుస్తుంది.... ఈ మూడు చోట్లలో ఒక్క చోట టీడీపీ గెలిచినా వైసీపీ వాళ్లు పందెం వదిలేసుకుంటారు. మూడు చోట్ల గెలిస్తేనే వైసీపీ వాళ్లకు పందెం వెళుతుందన్నమాట. ఈ పందెంపై వైసీపీ సవాల్ చేసి మరీ బెట్టింగ్ బరిలో ఉండడంతో టీడీపీ వాళ్లు సైతం షాక్ అవుతున్నారు. వాస్తవంగా చూస్తే మాచర్లలో చివరి నాలుగు ఎన్నికల్లోనూ టీడీపీ గెలవలేదు. నరసారావుపేటలో కూడా చివరి మూడు ఎన్నికల్లో టీడీపీ జెండా ఎరగలేదు. గత ఎన్నికల్లో ఇక్కడ టీడీపీ తాము గెలవమని డిసైడ్ అయ్యే సీటు బీజేపీకి వదులుకుంది.
స్పీకర్ కోడెల అండ్ ఫ్యామిలీ ఎఫెక్ట్తో ఇప్పుడు కూడా ఈ రెండు సీట్లతో తాము గెలుస్తామన్న నమ్మకం టీడీపీ వాళ్లకే లేకుండా పోయింది. ఇక మాచర్లపై మాత్రం ఈ సారి టీడీపీ ఎంతో కొంత ఆశలు పెట్టుకుంది. వైసీపీ మాత్రం ఈ సారి కూడా మాచర్ల మా ఖాతాలోదే అంటోంది. ఏదేమైనా వైసీపీ వాళ్లకు ఎంత నమ్మకం ఉంటే ఏకంగా మూడు సీట్లపై ఈ తరహా పందెం కాస్తారన్నది కూడా ఆలోచించాలి.