వివాహేతర సంబంధం పంచని కాపురంలో నిప్పులు పోసింది. ప్రయుడి మోజులో ప్రేమించి పెళ్లి చేసుకున్న భర్తను, తొమ్మినెలలు మోసి కన్న కొడుకుని హతమార్చింది ఓ ఇల్లాలు. అంతే కాదు.. తనకేమి తెలియనట్టు యాక్టింగ్ చేస్తూ.. పోలీస్ స్టేషన్కు వెళ్లింది. తన భర్త, కొడుకు కనిపించడం లేదంటూ ఫిర్యాదు చేసింది. తమిళనాడులో ఈఘటన చోటు చేసుకుంది.
అయితే ఆమె ఫిర్యాదు తీసుకున్న పోలీసులు.. ఆమెను ప్రశ్నించారు. పోలీసులు అడిగిన ప్రశ్నలకు పొంతనలేని సమాధానం చెబుతుండటంతో అనుమానం వచ్చింది. దీంతో ఆమెను అదుపులోకి తీసుకుని తమ స్టైల్లో విచారించడంతో అసలు నిజం బయటకొచ్చింది. తన భర్తతో పాటు తన కుమారుడిని తానే హత్య చేశానని చెప్పగా పోలీసులు షాక్ అయ్యారు. అంతేకాదు.. వారిని ఇంటి సమీపంలోని బావిలో పూడ్చి పెట్టినట్టు చెప్పింది ఆ ఇల్లాలు.
వేలూరు జిల్లా ఆర్కాడులోని తాజ్పురా మందవేలికి చెందిన సుబ్రహ్మణి కుమారుడు రాజా ఎలక్ట్రీషియన్గా పనిచేస్తున్నాడు. రెండేళ్ల క్రితం అదే ప్రాంతానికి చెందిన దీపిక అనే యువతిని ప్రేమించి పెళ్లి చేసుకున్నాడు. వారి పచ్చని కాపురానికి ఏడాది వయసున్న కొడుకు కూడా ఉన్నాడు.
కట్ చేస్తే.. రాజా కోసం అప్పుడప్పుడు ఇంటికొచ్చే ఓ యువకుడిపై దీపిక మనసు పడింది. అతడితో వివాహేతర సంబంధం పెట్టుకుంది. ఇంకేముంది తన భర్తకు తెలియకుండా దీపిక ఈ వ్యవహారాన్ని గుట్టుగా సాగిస్తోంది. అయితే ఈ అక్రమ సంబంధం ఎప్పటికైనా తన భర్తకు తెలిసిపోతుందని భావించిన దీపిక భర్త, కుమారుడు నిద్రపోతున్న టైమ్లో వారిని చంపింది. ఇంటి దగ్గర్లోని భావిలో ఇద్దరినీ పూడ్చి పెట్టింది.
తన భర్త, కుమారుడిని హతమార్చిన అనంతరం కొత్త నాటకానికి తెరలేపింది దీపిక. తన భర్త, కుమారుడు.. ఈ నెల 13వ తేదీ నుంచి కనిపించడం లేదని గురువారం ఆర్కాడు పోలీసు స్టేషన్లో దీపిక ఫిర్యాదు చేసింది. వారి ముందు కన్నీరు పెట్టుకుంది. అయితే ఆమె బాధను విన్న పోలీసులు.. మీ భర్త ఫోన్ నెంబర్ ఇవ్వండి.. ఎక్కడున్నా పట్టుకుంటామని పోలీసులు చెప్పగా.. ఫోన్ ఇంట్లోనే పెట్టేసి వెళ్లినట్లు సమాధానం ఇచ్చింది.
తర్వాత పోలీసులు ఆమెను వివిధ కోణాల్లో విచారించారు. అందుకు దీపిక తడబడుతూ పొంతనలేని సమాధానాలు చెప్పింది. దీంతో అనుమానం వచ్చి దీపికను అదుపులోకి తీసుకుని విచారించగా.. వారిద్దరినీ తానే హత్యచేసి పూడ్చి పెట్టినట్లు నేరం ఒప్పుకుంది. దీంతో ఆమెను గురువారం రాత్రి స్టేషన్లోనే ఉంచి శుక్రవారం ఉదయం సంఘటనాస్థలికి తీసుకెళ్లారు.
భర్త, కుమారుడిని పూడ్చిపెట్టిన ప్రాంతాన్ని చూపించగానే రాజా బంధువులు దీపికపై దాడి చేశారు. ఆమె పుట్టింటిపై కూడా దాడికి యత్నించారు. దీంతో పోలీసులు వారిని అడ్డుకున్నారు. దీపికను పోలీస్స్టేషన్కు తరలించారు. మృతదేహాలను వెలికి తీసి పోస్టుమార్టం నిమిత్తం ఆస్పత్రికి తరలించారు.
ఈ నేపథ్యంలో దీపికతో వివాహేతరం సంబంధం పెట్టుకున్న యువకుడిని సైతం పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. ఈ జంట హత్యలతో ఇంకా ఎవరి పాత్రైనా ఉందా...? ఎంత మంది కలిసి హత్య చేశారు.. ఎందుకు హత్య చేశారు అన్న కోణంలో పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు.