ఏపీలో జనసేన పార్టీకి ఎన్ని అసెంబ్లీ సీట్లు వస్తాయో ఆంధ్ర ఆక్టోపస్, విజయవాడ మాజీ ఎంపీ లగడపాటి రాజగోపాల్ స్పష్టం చేశారు. తన ఫ్లాష్ టీమ్ ద్వారా సర్వే చేయించిన ఆయన ఎగ్జిట్ పోల్ ఫలితాలను విడుదల చేశారు. ఆదివారం సాయంత్రం దేశంలో ఏడో దశ పోలింగ్ ముగిసిన వెంటనే ఆయన చెప్పిన ఫలితాల్లో అసెంబ్లీ సీట్ల విషయానికి వస్తే టీడీపీ 100 (10 + లేదా -) , వైసీపీ 72 (7 + లేదా -), జనసేన 1-3 మధ్య సీట్లు గెలుచుకునే అవకాశం ఉందని రాజ్గోపాల్ చెప్పారు.
ఇక లోక్సభ సీట్ల విషయానికి వస్తే టీడీపీ 15 (2 + లేదా -) , వైసీపీ 10 (2 + లేదా -), ఇతరులు 1 సీట్లు గెలుచుకునే అవకాశం ఉందని తెలిపారు. అసెంబ్లీ స్థానాల్లో పార్టీల ఓట్ల శాతం చూస్తే టీడీపీ 43 - 45 % -వైసీపీ 40 - 42 % - జనసేన 10-12 % సాధించనున్నాయి. పార్లమెంటు స్థానాల్లో ఓట్ల శాతం చూస్తే టీడీపీ 43 - 45 % - వైసీపీ 40.5 - 42.5 % - జనసేన 10 - 12 % సాధిస్తాయట.
ఇక రాజ్గోపాల్ ముందు నుంచి టీడీపీకి అనుకూలంగానే ఫలితాలు చెప్పబోతున్నారని అందరూ అంచనా వేశారు. ఈ విషయంలో ఆయన కొత్తగా చెప్పిందేమి లేదు. అయితే రేపు ఫలితాల్లో కీలకంగా మారిన యువత ఓట్లలో మెజార్టీ ఓట్లు వైసీపీకే పడ్డాయని చెప్పారు. యువత ఓట్లు దక్కించుకోవడంలో వైసీపీ అధినేత జగన్ ముందు వరుసలో ఉంటే... సెకండ్ ప్లేస్లో జనసేన అధినేత పవన్ ఉన్నారని... ఈ ఓట్లను సాధించే క్రమంలో చంద్రబాబు కేవలం మూడో స్థానంతో సరిపెట్టుకున్నట్టు చెప్పారు.