గత ఐదు ఎన్నికల్లో ప్రతి ఎన్నికకు నియోజకవర్గం మారుతూ గెలుస్తూ వస్తోన్న మంత్రి గంటా శ్రీనివాసరావుకు ఈ ఎన్నికల్లో ఓటమి తప్పందంటూ ఆయన పోటీ చేసిన నియోజకవర్గ తాజా మాజీ ఎమ్మెల్యే విష్ణుకుమార్ రాజు జోస్యం చెప్పారు. విశాఖ నార్త్ నియోజకవర్గం నుంచి ఈ ఎన్నికల్లో పోటీ చేసిన మంత్రి గంటా 25 ఏళ్ల రాజకీయ జీవితానికి నియోజకవర్గ ప్రజలు స్వస్తి చెప్పనున్నారని అన్నారు. సోమవారం ఆయన మీడియాతో మాట్లాడుతూ ఇక్కడ బీజేపీ తరపున సిట్టింగ్ ఎమ్మెల్యేగా పోటీ చేసిన తాను లేదా వైసీపీ అభ్యర్థి కెకె.రాజులలో ఎవరో ఒకరు గెలుస్తామని చెప్పారు. ఇక గంటా మాత్రం ఇక్కడ గెలిచే ఛాన్స్ లేదని విష్ణు కుండబద్దలు కొట్టేశారు.
ఇక ఏపీలో బీజేపీ గెలుపు అవకాశాలపై ఆయన మాట్లాడుతూ ఏపీలో బీజేపీకి లోక్సభ సీట్లు గెలిచే అవకాశం లేదన్నారు. మూడు అసెంబ్లీ సీట్లలో గట్టిపోటీ ఇచ్చామని చెప్పారు. ఏపీలో ఎవరు ? విజయం సాధిస్తారన్న ప్రశ్నకు ఆయన బదులు ఇస్తూ ఈ ఎన్నికల్లో టీడీపీ, వైసీపీ కోట్లాది రూపాయలు ఖర్చు చేశాయని... ప్రజాస్వామ్యాన్ని అపహాస్యం చేసేలా ఈ రెండు పార్టీల ఓటర్లను ప్రలోభాలకు గురి చేయడం సిగ్గుచేటని అన్నారు. ఇక కేంద్రంలో నరేంద్రమోడీని టార్గెట్గా చేసుకుని వ్యతిరేక పార్టీలు ఆడే ఆటలకు 23న ఫలితాల తర్వాత చెల్లు అవుతుందన్నారు.
ఎవరి సహాయం లేకుండానే బీజేపీ సొంతంగా 280 సీట్లతో మళ్లీ అధికారంలోకి వస్తుందని ఆయన చెప్పారు. అదే క్రమంలో విష్ణు ఏపీ సీఎం చంద్రబాబుపై సైతంసెటైర్లు వేశారు. ఢిల్లీకి వచ్చి అందరినీ కూడగట్టే ప్రయత్నం చేయడం రెండు రోజుల ముచ్చటలా ఉందని ఎద్దేవా చేశారు. ఏదేమైనా విశాఖ నార్త్ నుంచి సిట్టింగ్ ఎమ్మెల్యేగా పోటీలో ఉండడంతో పాటు మంత్రి గంటా ఓడిపోతున్నాడంటూ విష్ణుకుమార్ చేసిన వ్యాఖ్యలు ఇప్పుడు రాజకీయ వర్గాల్లో చర్చకు వస్తున్నాయి. ఈ క్రమంలోనే అక్కడ తాను గెలవకపోయినా.. వైసీపీ గెలుస్తుందని చెప్పడం మరో విశేషం. మరి విష్ణు వ్యాఖ్యలు ఎంత వరకు నిజం అవుతాయో ? చూడాలి.