తాజాగా జరిగిన సార్వత్రిక ఎన్నికల్లో ఏపీలో తెలుగుదేశం పార్టీదే విజయమని మిగతా వారికంటే భిన్నంగా...మాజీ మంత్రి లగడపాటి రాజగోపాల్ ఎగ్జిట్ పోల్స్ ప్రకటించి అందరిలో ఆసక్తిని రేకెత్తించిన సంగతి తెలిసిందే. అన్నపోల్స్లో వైసీపీ గెలుపు అని ప్రకటించగా...లగడపాటి మాత్రం టీడీపీ అని ప్రకటించినప్పటికీ..తెలుగుదేశం పార్టీ నేతల్లోనే ఈ సర్వేపై సందేహాలున్నాయనే భావన వ్యక్తమవుతోంది. తాజాగా టీడీపీ సీనియర్ నేత, సాక్షాత్తు కేబినెట్ మంత్రి మాట్లాడుతూ, ``ప్రజల నాడీ తెలిసినోడు ఎగ్జిట్ పోల్ చేయాల. ప్రతి ఒక్కరూ సర్వేలు చేసేస్తే నష్టపోయే ప్రమాదం ఉంది.`` అని సంచలన వ్యాఖ్యలు చేశారు.
తాజాగా, మంత్రి అయ్యన్నపాత్రుడు మీడియాతో మాట్లాడుతూ, తెలంగాణ ఎన్నికల్లో లగడపాటి రాజగోపాల్ ఇచ్చిన ఎగ్జిట్ పోల్తో ప్రజలు కొన్ని కోట్ల రూపాయాలు నష్టపోయారని ఆవేదన వ్యక్తం చేశారు. లగడపాటి మాట నమ్మి సర్వనాశనమైపోయామని తనతో చాలా మంది చెప్పారని, కోట్ల రూపాయలు నష్టపోయి వీధిన పడ్డామని ఆవేదన చెందారని అయ్యన్నపాత్రుడు పేర్కొన్నారు. `ఇలా ప్రజల నాడి తెలియన వారు సర్వేలు చేస్తే జనాలు ఇలాగే నష్టపోయే అవకాశం ఉంటుంది`` అని అయ్యన్నపాత్రుడు వ్యాఖ్యానించారు.
ఓ వైపు లగడపాటి సర్వేతో తెలుగుదేశం పార్టీ నేతలు సంబరపడిపోవడమే కాకుండా...వందకు వేయి శాతం తమదే విజయమని ప్రకటిస్తున్న తరుణంలో...అదే పార్టీకి చెందిన ముఖ్యనేతల్లో ఒకరు...సాక్షాత్తు కేబినెట్ మంత్రి ఆ సర్వే ప్రజల నాడికి భిన్నంగా ఉందని...అసలు దానికి విశ్వసనీయత లేనే లేదని ప్రకటించడం చర్చనీయాంశంగా మారింది. మంత్రిగారి మాటలు చూస్తుంటే...టీడీపీ గెలుపుపై పార్టీ నేతలకే నమ్మకం లేదని స్పష్టమవుతోందని పలువురు చర్చించుకుంటున్నారు.