నరాల తెగే ఉత్కంఠను సృష్టిస్తూ ఏపీలో హోరాహోరీగా సాగిన ఎన్నికల ఫలితాలకు రెండ్రోజుల సమయం కూడా లేని సంగతి తెలిసిందే. అయితే, ఏడో విడత పోలింగ్ అనంతరం విడుదలైన ఎగ్జిట్ పోల్స్లో ప్రతిపక్ష నేత, వైఎస్సార్ సీపీ అధ్యక్షుడు వైఎస్ జగన్కు ఆంధ్రప్రదేశ్ ప్రజలు బ్రహ్మరథం పట్టారని, రాష్ట్రానికి ఆయన నూతన ముఖ్యమంత్రి కానున్నారని ప్రతిష్టాత్మక జాతీయ, రాష్ట్ర స్థాయి సర్వే సంస్థలు చేపట్టిన తేల్చేశాయి. అయితే, తెలుగుదేశం నేతలు మాత్రం తమ విజయంపై భరోసాను వీడటం లేదు. అయితే, ఈ ధైర్యం సందర్భంగా వారు చేస్తున్న కామెడీ నవ్వులను పూయిస్తోందని అంటున్నారు.
తెలుగుదేశం పార్టీ విజయం పక్కా అని పేర్కొంటూ విలేకరుల సమావేశం నిర్వహిస్తూ..మీడియాతో మాట్లాడుతున్న తరుణంలో టీడీపీ నేతల హావాభావాలు చర్చనీయాంశంగా మారడమే కాకుండా...సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి. ఒకరిని మించి మరొకరు అన్నట్లుగా నేతలు నవ్వులు పంచుతున్నాయని అంటున్నారు. తెలుగుదేశం పార్టీ అధికార ప్రతినిధి, ఎమ్మెల్సీ బుద్ధా వెంకన్న ప్రెస్మీట్లో ఆసక్తికరంగా ప్రవర్తించిన సంగతి తెలిసిందే. తెలుగుదేశం పార్టీదే విజయమని విలేకరుల సమావేశంలో ప్రకటిస్తూ....బుద్ధా వెంకన్న తొడగొట్టి ప్రకటించారు. ఈ చర్య పలువురిని ఆశ్చర్యానికి గురి చేసింది.
బుద్ధా వెంకన్న చర్యే పలువురిని ఆశ్చర్యానికి గురిచేయగా....టీడీపీకి చెందిన ఎమ్మెల్యే బొండా ఉమామహేశ్వరరావు మరింత ఆసక్తికరంగా వ్యవహరించారు. ఓ మీడియా సంస్థతో బోండా ఉమ మాట్లాడుతూ, తన రాజకీయ భవితవ్యంపై పూర్తి భరోసా వ్యక్తం చేశారు. ఐదేళ్లుగా తాను చేసిన ప్రజాసేవనే తనను గెలిపిస్తుందని, అత్యధిక మెజార్టీతో తాను గెలవడం ఖాయమని ఆయన ఢంకా భజాయించి చెబుతున్నారు. కావాలంటే నా బీపీ చూడండి అంటూ.. మిషన్ను తెచ్చి ప్రత్యక్షంగా తనను చెక్ చేయమని చెప్పి చెక్ చేయించుకోవడం విశేషం. ఎన్నికల ఫలితాల విషయంలో దైర్యం ఉండటంలో తప్పేం లేదని...అయితే మరీ ఈ స్థాయిలో ఉండటం ఏంటని పలువురు చర్చించుకుంటున్నారు.