ఎన్నికల ఓట్ల లెక్కింపు కాకుండానే రికార్డు ఎలా సాధ్యం.. అన్న అనుమానం రావచ్చు..కానీ ఇది నిజం.. ఆ నియోజకవర్గం ఓట్లలెక్కింపు ద్వారా రికార్డు నమోదు చేసుకోబోతోంది. ఇంతకీ ఆ నియోజకవర్గం ఏదోచెప్పలేదు కదా.. అదే నిజామాబాద్ లోక్సభ స్థానం..
సాధారణంగా ఓట్ల లెక్కింపుకు 14 టేబుళ్లు వాడతారు. కానీ ఈ స్థానం నుంచి 176 మంది రైతులతో పాటు వివిధ పార్టీల అభ్యర్థులు పోటీ చేసిన సంగతి తెలిసిందే. అందుకే ఇక్కడ నోటాతో కలిసి బ్యాలెట్లో 186 గుర్తులున్నాయి. అందుకే 12 బ్యాలెట్ యూనిట్లతో పోలింగ్ నిర్వహించారు.
ఇప్పుడు ఓట్ల లెక్కింపు కూడా ఓ సవాలే.. అందుకే ఆలస్యం జరగకుండా ఉండేందుకు ఇక్కడ టేబుళ్ల సంఖ్యను పెంచాలని అధికారులు ప్రతిపాదించారు. ఎన్నికల సంఘం ఈ అంశంపై స్పందించి 36 టేబుళ్లకు అనుమతి ఇచ్చింది.
దేశంలో ఇప్పటి వరకు అత్యధికంగా 24 టేబుళ్లపైనే లెక్కించారు. ఇదే రికార్డు.. ఇప్పుడు 36 టేబుళ్లపై చేపట్టేందుకు అనుమతివ్వటం దేశంలోనే ఇది మొదటిసారిగా అధికారులు వెల్లడించారు. 36 టేబుళ్లపై ఓట్లు లెక్కించే నియోజకవర్గంగా నిజామాబాద్ నిలవనుంది.